పొలిటికల్ మైలేజ్ కోసమేనా ?

జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా మైలేజీ కోసమే అని పోలీసులు తేల్చేశారు. పట్టాభి అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. సీఎంను టార్గెట్ చేసుకునే ఉద్దేశ్యపూరితంగా, సమాజంలో అశాంతిని రేకెత్తించే ఉద్దేశ్యంతోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టుకు తెలిపారు.

పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఎలాంటి అంశాంతి రేగిందో ఉదాహరణలతో సహా పోలీసులు వివరించారు. టీడీపీ నేతలను అరెస్టు చేయకపోతే జరగబోయే అనర్ధాలను పోలీసులు కోర్టుకు వివరించారు. సదరు నేతను అరెస్టు చేయకపోతే ఫిర్యాదు దారుడిని, ఇతర సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పట్టాభిపైన ఉన్న నాలుగు కేసులను పోలీసులు వివరించారు. ఈ నేత చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా సమాజంలో జరిగిన గొడవల వివరాలను కూడా చెప్పారు.

పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా మొదలైన వైషమ్యాలు, పార్టీ ఆఫీసులపై దాడులు, ఒక పోలీసు అధికారిపై జరిగిన హత్యాయత్నం తదితర వివరాలన్నింటినీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఇలాంటి కారణాల వల్లనే పట్టాభిని అరెస్టు చేయాల్సొచ్చిందని కూడా చెప్పారు. అరెస్టు చేయకపోతే కులాలు, మతాల మధ్య వైషమ్యాలతో సమాజంలో జరగబోయే అనర్ధాలను కూడా పోలీసులు వివరించారు. సమాజంలో అశాంతిని రేకెత్తించటమే టార్గెట్ గా పట్టాభి అనుచిత వ్యాఖ్యలను చేసినట్లు పోలీసులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యాఖ్యల వెనుకున్న కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాల్సుందని పోలీసులు కోర్టుకు వివరించారు.

టీడీపీ నేత పట్టాభి నేర స్వభావం కలిగిన వ్యక్తిగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఈ నేత కారణంగా భవిష్యత్తులో జరగబోయే దుష్ఫలితాలను నియంత్రించాలంటే అరెస్టు చేయటం తప్ప వేరే దారిలేదని చెప్పారు. గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను దాని పర్యవసానంగా జరిగిన దాడులను కూడా పోలీసులు తమ రిపోర్టులో వివరించారు. దీన్నిబట్టి పట్టాభి కావాలనే జనాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యలు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టంగా చెప్పారు.

పట్టాభికి ఎట్టి పరిస్ధితుల్లోను బెయిల్ ఇవ్వకూడదని ఒకవేళ బెయిల్ ఇస్తే మరిన్ని అనర్థాలు జరిగే అవకాశాలున్నట్లు కూడా పోలీసులు ఆందోళన వ్యక్తంచేశారు. రిమాండ్ రిపోర్టు చూసిన తర్వాత బెయిల్ పిటీషన్ కొట్టేసి నవంబర్ 3వ తేదీవరకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం సబ్ జైలు నుండి పట్టాభిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.