బాబుకు సొంత జిల్లాలోనే షాక్‌

Chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేవ‌డానికి.. పార్టీని బ‌తికించుకోవ‌డానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. పార్టీకి పునర్వైభ‌వం తెచ్చే దిశ‌గా శాయాశ‌క్తులా కృషి చేస్తున్నారు. పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించ‌డంతో పాటు అధికార వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల నోళ్ల‌లో పార్టీ పేరు నానేలా కార్య‌క‌ర్త‌లు శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయ‌న సాగుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం బాబుకు ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. ఆయ‌న‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో బాబుకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

ఇప్ప‌టికే ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సొంత‌ నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వ‌చ్చిన దారుణ‌మైన ఫ‌లితాల‌తో ఢీలా ప‌డ్డ బాబుకు.. ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగాధ‌రనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కురాలైన మాజీ మంత్రి టీడీపీ సీనియ‌ర్ నేత గుమ్మ‌డి కుతూహ‌లమ్మ పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలిసింది. ఆమెతో పాటు ఆమె త‌న‌యుడు టీడీపీ ఇంఛార్జ్ హ‌రికృష్ణ కూడా రాజీనామా చేసి బాబుకు డ‌బుల్ షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌నే కార‌ణంతోనే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ రాజీనామా లేఖ‌ల‌ను అధిష్ఠానానికి పంపిన‌ట్లు స‌మాచారం. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గంగాధ‌ర నెల్లూరు నుంచి కుతూహ‌ల‌మ్మ ప్రాతినిథ్యం వ‌హించారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌ద‌వులు అందుకున్నారు. ఆపై టీడీపీలో చేరారు. త‌న కుమారుణ్ని రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చారు.

కొన్ని నెల‌ల నుంచి పార్టీలో త‌న‌కు త‌న త‌న‌యుడికి త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌ని కుతూహ‌లమ్మ అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలిసింది. గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న హ‌రికృష్ణ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ‌స్వామి చేతిలో ఓడారు. ఆ త‌ర్వాత వాళ్లు టీడీపీని వీడుతార‌ని గ‌తంలో ప్ర‌చారం సాగింది. కానీ అవ‌న్నీ వ‌దంతులేన‌ని ఈ త‌ల్లీ కొడుకులు కొట్టేశారు. చిన్న వ‌య‌సులోనే త‌న‌కు బాబు నియోజ‌క‌వర్గ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పార‌ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అండ‌గా నిలిచార‌ని టీడీపీకి ద్రోహం చేయ‌లేమ‌ని హ‌రికృష్ణ గ‌తంలో పేర్కొన్నారు. కానీ ఆ త‌ర్వాత ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోయాయి.

పార్టీ వైఖ‌రిపై గ‌త కొంత‌కాలంగా ఈ త‌ల్లీ కొడుకులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌కు ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. అయితే గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో హ‌రికృష్ణ వైసీపీలో చేరే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. పార్టీలోకి ఓ వ‌ర్గం ఆయ‌న్ని వైసీపీలోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. మంత్రి నారాయాణ స్వామిపై ఓ సామాజిక వ‌ర్గం ఆగ్ర‌హంగా ఉంద‌ని అందుకే హ‌రికృష్ణ‌ను పార్టీలోకి చేర్చుకునే విష‌యాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్ల‌రాని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే హ‌రికృష్ణ టీడీపీకి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఆయ‌న వైసీపీ గూటికి చేర‌తారా? అన్న‌ది చూడాలి.