ఏది విమ‌ర్శ‌-ఏది వివాదం.. పార్టీలు నేర్పుతున్న పాఠం ఏంటి?

ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు.. నేర్పుతున్న పాఠం ఏంటి? అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? అయిన దానికీ .. కానిదానికీ కాలు దువ్వ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం.. రాజ‌కీయంగా చూసుకోవాల్సిన వివాదాల‌ను రాళ్ల దాడుల వ‌ర‌కు తెచ్చుకోవ‌డం ఎందుకు? ఇవీ.. ఏపీ గురించి.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు. రాజ‌కీయాల్లో ఉన్నవారు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోవ‌డం.. ఒక పార్టీ విధానాల‌ను మ‌రో పార్టీ త‌ప్పుబ‌ట్ట‌డం.. అదికారంలో ఉన్న పార్టీ తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌జావ్య‌తిరేక విధానాలు అయితే.. వాటిని త‌ప్పుబ‌ట్ట‌డం.. వంటివి ప్ర‌జాస్వామ్య దేశంలో స‌ర్వ‌సాధార‌ణం.

ఉమ్మ‌డి ఏపీనే తీసుకుంటే.. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఆయ‌న తీసుకున్న విధానాల‌ను త‌ప్పుబ‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కులు ఉన్నారే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌ను దూషించిన నాయ‌కులు లేరు. అదేవిధంగా ఎన్టీఆర్ కూడా ప్ర‌జాస్వామ్య సంస్కృతిని ఎప్పుడూ త‌ప్ప‌లేదు. త‌న‌కు ఎంత బాధ క‌లిగినా.. సుతిమెత్త‌గా స‌మాధానం చెప్పారే త‌ప్ప‌.. ప‌రుష ప‌ద‌జాలం వినియోగించిన సంద‌ర్భం మ‌చ్చుకైనా క‌నిపిం చ‌దు. పోనీ.. 80ల నుంచి 90ల కాలానికి వ‌చ్చినా.. ఇదే సంస్కృతి క‌నిపించింది. అసెంబ్లీలోనే వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిని చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తిన‌ప్పుడు.. కూడా రాజ‌శేఖ‌ర‌రెడ్డి నోరు పారేసుకోలేదు.

అలాగ‌ని మౌనంగాను ఉండ‌లేదు. ఔను చంద్ర‌బాబూ.. ఈ ప‌ద‌వి.. మీ నాన్న‌గారో.. మా నాన్న‌గారో.. ఇవ్వ‌లా.. ప్ర‌జ‌లు ఇచ్చారు అంటూ.. సాత్విక ప‌దాల‌తో ప‌దునైన విమ‌ర్శ‌లు చేసి.. ప్ర‌తిప‌క్షం కాళ్ల‌కు ముంద‌ర బంధాలు వేసిన ప‌రిస్థితి ఉంది. ద‌రిమిలా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ఉద్య‌మంతో ప్రారంభ‌మైన స‌న్నాసులు.. ల‌ఫూట్‌లు.. ఎద‌వ‌లు.. ద‌ద్ద‌మ్మ‌లు.. అనే సంస్కృతి.. న‌వ్యాంధ్ర‌కు కూడా పాక‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ విమ‌ర్శ‌లు మ‌రీ హ‌ద్దులు మీరాయ‌నే చెప్పాలి. దీనికి అధికార‌మే కార‌ణ‌మ‌నే వాద‌న ఉంది. వైసీపీని అధికారంలోకి రాకుండా చేసే ప్ర‌క్రియ‌లో టీడీపీ నేత‌లు.. ముందుగా.. ఉగ్ర‌వాది.. అరాచ‌క‌వాది.. లోఫ‌ర్‌.. అంటూ.. జ‌గ‌న్‌ను దూషించ‌డం.. 2014కు ముందు మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇక‌, నువ్వు పోక‌చెక్క‌తో అంటే.. నేను త‌లుపు చెక్క‌తో అన‌లేనా.. అన్న‌ట్టుగా.. వైసీపీ నాయ‌కులు కూడా ఇదే పంథాను కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కొడాలి నాని.. అనిల్‌కుమార్ యాద‌వ్ స‌హా.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటివారు.. మాట‌ల తూటాలు పేల్చ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ క్ర‌మంలో ఎక్క‌డో ఒక చోట అడ్డు క‌ట్ట వేయాల్సిన బాధ్య‌త‌ను తీసుకోవాల్సిన చంద్ర‌బాబు కానీ.. వైసీపీ సీనియ‌ర్లు కానీ.. పార్టీ అధినేత కానీ.. ఎంజాయ్ చేస్తున్నార‌నేది.. నిర్వివాదాంశం.

ఇక‌, దీనికి తోడు.. ఎవ‌రు ఎన్ని ఎక్కువ తిట్లు తిడితే.. అంత‌గా మీడియాలో ఉంటాం.. అనేధోర‌ణి కూడా ఈవిమ‌ర్శ‌ల‌కు అర్ధాన్ని మార్చి.. వివాదాల‌కు దారితీసింది. దీంతో ఇప్పుడు నాకొడ‌క‌.. బోష్‌డీకే.. వంటి ప‌దాల‌కు రాజ‌కీయ నేత‌ల నోళ్లు అల‌వోక‌గా తిరిగిపోతున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితి మార్చేదెవ‌రు? ప్ర‌జ‌లా? పార్టీ అధినాయ‌కులా? ఈ మొత్తం ఎపిసోడ్‌లో పార్టీలు బాగానే ఉన్నా.. ప్ర‌జ‌లే ఇబ్బ‌దులు ప‌డుతున్నారు. అటు టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే.. ప్ర‌తిగా ఇటు వైసీపీ నిర‌స‌న‌ల‌కు పిలుపు నివ్వ‌డం.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌డ‌గండ్ల పాల్జేసింద‌నే చెప్పాలి.