సాయిరెడ్డి దూకుడు త‌గ్గిందే.. రీజ‌నేంటి?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క నాయ‌కుడు, ఇటు ఏపీలోనూ.. అటు ఢిల్లీలోనూ చ‌క్రం తిప్పుతున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన వి. విజ‌య‌సాయి రెడ్డి దూకుడు ఇటీవ‌ల కాలంలో ఫుల్లుగా త‌గ్గిపోయింది. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మాట కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల పార్టీ నాయ‌కుడిగా.. అన్నీ తానై.. వ్య‌వ‌హ‌రిస్తున్న సాయిరెడ్డి.. ఇప్పుడు అక్క‌డ కూడా క‌నిపించ‌డం లేదు. విశాఖ స‌హా ఎక్క‌డా ఆయ‌న దూకుడు క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నార‌నే.. ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా.. వైసీపీలోనూ ఆస‌క్తిగా మారాయి.

నిజానికి వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత నెంబర్‌ టూ పొజిషన్‌ విజయసారెడ్డిదే అని ప్ర‌చారంలో ఉంది. ఇక‌, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే.. సాయిరెడ్డిదే హవా. మ‌రీ ముఖ్యంగా విశాఖలో అయితే సాయిరెడ్డికి తిరుగేలేదు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దా రెడ్డి అని విప‌క్షాల విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఆ మధ్య సాయిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖలో ప్లెక్సీలు,కటౌట్లు కట్టి ఆయన అభిమానులు ప్రేమను చాటుకున్నారు. వీటిని చూసిన వారు ఇది విశాఖపట్నమా..? విజయసాయి పట్నమా అనేలా చేశారు.

అయితే.. ఇప్పుడు ఇదే విశాఖ‌లో సాయిరెడ్డి పేరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఆయ‌న‌పై ఉన్న అసంతృప్తి కొద్దికొద్దిగా బయటపడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయన విశాఖ పట్నం కేంద్రంగా నడుపుతున్న రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. విజయసాయి అచరులను ఎవర్ని విశాఖలో ఉండవద్దని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరో వైపు విజయసాయి రెడ్డి అండ్ కో పై జరుగుతున్న ప్రచారాల నేపధ్యంలో ఆయన కూడా సైలెంట్ అయిపోయారట. అందుకే ఆయన విశాఖకు వచ్చినా…తన పని తాను చూసుకొని వెళ్లిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విజయసాయి అనుచరులు సెటిల్మెంట్లు చూసుకుంటూ దోచుకుంటున్నారని విస్త్రతంగా ప్రచారం జరుగు తోంది. ఇదే పంథా కొనసాగితే భవిషత్తులో పార్టీకి నష్టమని హైకమాండ్ దృష్టికి కొందరు తీసుకువెళ్లారని.. ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డికి క్లాస్ ఇచ్చార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ఢిల్లీలోనూ మునుపు ఉన్న లాబీయింగ్‌.. ఇప్పుడు సాయిరెడ్డి చేయ‌లేక పోతున్నార‌ని.. ఏదైనా ఉంటే నేరుగా ముఖ్య‌మంత్రి రంగంలోకి దిగే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. అందుకే.. ఆయ‌న వ‌ల్ల ఏమీ కాద‌ని డిసైడ్ అయి.. సాయిరెడ్డి హ‌వాను అధిష్టాన‌మే త‌గ్గించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, విశాఖ‌లోనూ సొంత పార్టీ నేత‌లే.. సాయిరెడ్డికి స‌హ‌క‌రించ‌డం మానుకున్నారు. వెర‌సి.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన అధిష్టానం.. సాయిరెడ్డి దూకుడును త‌గ్గించింద‌ని అంటున్నారు.