బొగ్గు కొరత కేంద్రం కుట్రేనా ?

మనదేశంలో బొగ్గుకు కొరత లేదని కావాలని కేంద్రమే కృత్రిమ కొరత సృష్టించిందా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అనేక అంశాలపై తనదైన శైలిలో ప్రొఫెసర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లోని లోటుపాట్లను ఎండగడుతుంటారు. తాజాగా దేశం ఎదుర్కొంటున్న బొగ్గు కొరత, విద్యుత్ ఉత్పత్తి సమస్యలపై ప్రొఫెసర్ మాట్లాడుతు ప్రస్తుత బొగ్గు కొరత కావాలని కేంద్రమే సృష్టించిందంటు మండిపడ్డారు.

దేశంలో ఎంతో పాపులరైన కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ప్రధానంగా 2019 తర్వాత ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేయటం, లేకపోతే మూసేయటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటుపరం చేయటం ద్వారా రు. 6 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగానే ప్రైవేటుకు అమ్మేయాల్సిన ప్రభుత్వరంగ సంస్ధల జాబితాను కూడా కేంద్రం ఎప్పుడో ప్రకటించేసింది. ఇందులో భాగంగానే కోల్ ఇండియా మీద కూడా మోడి ప్రభుత్వం కన్నుపడిందంటు ప్రొఫెసర్ మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనదేశం నాలుగోస్ధానంలో ఉందన్నారు. అలాంటి ఇండియాలోనే బొగ్గు ఉత్పత్తికి, నిల్వలకు కొరత ఏమిటంటు వేసిన ప్రశ్న చాలా విలువైనదనే చెప్పాలి. కోల్ ఇండియాను ప్రైవేటీకరించటంలో భాగంగానే బొగ్గు గనులను కేంద్రం కేటాయించటంలేదన్నారు.

బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని తర్వాత ఆటోమేటిక్ గా విద్యుత్ చార్జీలు పెరిగిపోతాయన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం సరఫరా చేసే విద్యుత్ కన్నా తక్కువ ధరలకే తాము విద్యుత్ అందిస్తామని ప్రైవేటుసంస్ధలు రంగంలోకి దిగుతాయన్నారు. కొద్దిరోజులు తక్కువ ధరలకే విద్యుత్ ను సరఫరా చేసిన తర్వాత ప్రైవేటుసంస్ధలు ఒక్కసారిగా తమ ఉత్పత్తిని కూడా తగ్గించేసి ధరలు పెంచేస్ధాయని ప్రొఫెసర్ జోస్యం చెప్పారు.

కోల్ ఇండియాను విస్తరించటానికి బదులు నిర్వీర్యం చేయటానికే మోడి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కోల్ ఇండియా వల్ల దేశంలోని బొగ్గు ఆధారిటి విద్యుత్ ఉత్పత్తికి సరఫరా స్ట్రీమ్ లైన్ అవుతోందన్నారు. ఇలాంటి కోల్ ఇండియాకే బొగ్గుగనులు కేటాయించకపోతే బొగ్గు నిల్వలను ఎలా సర్దుబాటు చేస్తుందని ప్రొఫెసర్ కేంద్రాన్ని నిలదీశారు.  విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇనుప గనులను కేటాయించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లే కోల్ ఇండియాకు కూడా బొగ్గుగనులను కేటాయించకుండా మెల్లిగా నాశనం చేయటానికే మోడి సర్కార్ ప్లాన్ చేస్తోందన్నారు.