2024లో డీఎల్‌. రవీంద్రారెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ !


తెలుగు రాజకీయాల్లో కాక‌లు తీరిన నేత‌గా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్ప‌ష్టం చేశారు. క‌డ‌ప జిల్లా మైదుకురు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఐదుసార్లు విజ‌యం సాధించిన ఆయ‌న ఉమ్మ‌డి ఏపీలో మంత్రిగా ప‌నిచేశారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో మాత్రం డీఎల్‌కు తీవ్ర‌మైన విబేధాలు ఉండేవి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత డీఎల్ రాజ‌కీయం ఎటూ కాకుండా పోయింది. వైసీపీలో ముందు జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. డీఎల్ కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు నాడు జ‌గ‌న్‌పై స‌వాల్ చేసి మ‌రీ క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.

2014 త‌ర్వాత రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉన్న డీఎల్ టీడీపీలో టిక్కెట్ ద‌క్కుతుందేమో అని ఆశ‌ప‌డ్డారు. అయితే అక్క‌డ టీడీపీ నుంచి య‌న‌మ‌ల వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఉండ‌డంతో డీఎల్‌కు ఆ ఛాన్స్ రాలేదు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీకి స‌పోర్ట్ చేసి.. టీడీపీని భూస్థాపితం చేస్తాన‌ని శ‌ప‌థాలు చేశారు. అప్ప‌టి నుంచి వైసీపీతోనే ఉంటున్నా ఆయ‌న్ను వైసీపీలో ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. క‌నీసం ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌లు కూడా ఆయ‌న‌కు లేవు.

ఈ రెండున్న‌రేళ్ల నుంచి కోపాన్ని అణుచుకుంటూ వ‌స్తున్నారేమో గాని డీఎల్ ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌లో తాను ఖ‌చ్చితంగా మైదుకూరు నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా వైసీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఏపీలో ప‌రిస్థితులు దారుణంగా దిగ‌జారిపోయాయ‌ని.. ప్ర‌భుత్వంలో ఉన్న మంత్రులు అంద‌రూ డ‌మ్మీలుగా మారిపోయారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఏపీలో వ్య‌వ‌సాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ప‌డిపోయింద‌ని.. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి దారుణ ప‌రిస్థితి తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని.. ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాల‌న్నారు.

స‌జ్జ‌ల‌నే డీఎల్ టార్గెట్ చేశారా..?
డీఎల్ ఒక్క‌సారిగా ఇలా బ‌ర‌స్ట్ అవ్వ‌డానికి పార్టీలో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డ‌మే కార‌ణం అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్వ‌యంగా డీఎల్ ఇంటికి వెళ్లి మ‌ద్దతు కోరారు. డీఎల్ కూడా ఆ ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గాన్ని క‌లుపుకుని వైసీపీ గెలుపు కోసం ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత స‌జ్జ‌ల డీఎల్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌. ఇదే ఆయ‌న‌లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైందంటున్నారు. ఇక ఏపీలో మంత్రులు కాకుండా.. దారిన పోయే వాళ్లు ప్రెస్‌మీట్లు పెడుతున్నారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా ప‌రోక్షంగా స‌జ్జ‌ల‌ను టార్గెట్ చేసేలా ఉన్నాయంటున్నారు.

ఇక డీఎల్ 2024లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తాన‌ని చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే ఆయ‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ టీడీపీ నుంచే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను ఈ సారి ప‌క్క‌న పెట్టేస్తార‌ని తెలుస్తోంది. అక్క‌డ బ‌ల‌మైన కేడ‌ర్‌, వ‌ర్గం ఉన్న డీఎల్ పార్టీలో చేర‌డం ఆల‌స్యం ఆయ‌న‌కే బాబు సీటు ఇస్తార‌ని అంటున్నారు.