ఇళ్ల పట్టాలు అందరికీ అందేనా ?

అందరికీ ఇళ్ల పట్టాలు అనే విషయంలో ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా ఆచరణలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు అందరికీ అందించేందుకు రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు కొట్టేసింది. ప్రధానంగా రెండు మూడు అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. దీంతో కోర్టు తప్పు పట్టిన అంశాలను సరిచేసి మళ్ళీ మార్గదర్శకాలను జారీచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొత్తగా జారీ చేయబోయే మార్గదర్శకాలు ఎలాగుంటాయో ? వాటిని మళ్ళీ ఇంకెవరైనా కోర్టులో సవాలు చేస్తారా ? అనేది ఊహకందటంలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇంటి పట్టాలు మహిళల పేర్లతో కేటాయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు ప్రధానంగా తప్పుపట్టింది. ఇంటి పట్టాలు మహిళలకే కాకుండా అర్హులైన మగవారితో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా కేటాయించాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. మహిళల పేరుతో మాత్రమే ఇంటి పట్టాను కేటాయిస్తే భర్త నుంచి విడాకులు తీసుకుంటే అప్పుడు భర్త ఇల్లు లేని వాడవుతాడు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ట్రాన్స్ జండర్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీసింది.

ఇక అన్నింటికన్నా పెద్ద సమస్య ఏమిటంటే స్థల వైశాల్యం. మామూలుగా ఏ ప్రభుత్వమైనా కేటాయించే ఇంటి స్ధలమైనా కట్టించే ఇల్లైనా సెంటున్నర స్థలంలోనే ఉంటుంది. సెంటున్నర స్ధలం అన్నది ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్ణయమైంది. అదే కంటిన్యూ అవుతోంది ఇంకా. నిజానికి ఈ స్ధలం ఏ రకంగా చూసినా సరిపోదన్నది అందరికీ తెలిసిందే. కానీ హైకోర్టు మాత్రం ఇపుడదే విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. సెంటున్నర స్ధలం అసలు దేనికి సరిపోతుందో చెప్పమని నిలదీసింది.

అలాగే పేదలకు పంపిణీ చేసే స్ధలమైనా, నిర్మించే ఇల్లైనా సెంటున్నరలో సరిపోదని తేల్చేసింది. ఎంత స్థలంలో ఇల్లు నిర్మించాలనే విషయాన్ని నిపుణులతో కమిటీ వేసి ఫైనల్ చేయాలని సూచించింది. చివరగా ఐదేళ్ల తర్వాత ఇంటిని అమ్ముకోవచ్చనే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. పేదలందరికీ ఇళ్ళ పథకం ఉద్దేశ్యానికి ఇచ్చిన ఇంటిని అమ్ముకోవచ్చని చెప్పడం పూర్తిగా విరుద్ధమని కోర్టు కామెంట్ చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సెంటున్నర స్థలంలో ఇల్లంటే చాలా ఇరుగ్గానే ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ పేదల్లో చాలామంది ఉండే పూరిగుడెసలకన్నా సెంటున్నర స్ధలంలో ఇల్లు బాగా పెద్దదిగానే ఉంటుంది. పేదలకు గృహాలు నిర్మించే స్ధలాలు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మూడు నాలుగు సెంట్లలో ఇళ్ళు నిర్మించాలంటే ప్రభుత్వానికి స్థలం దొరకదు. నాలుగు సెంట్ల స్ధలంలో కట్టే ఇళ్ళంటే అవి పేదలకే కాదు మధ్య తరగతి కూడా కేటాయించచ్చు.

ఎందుకంటే దాదాపు ప్రతి ఇల్లు తక్కువలో తక్కువ వెయ్యిచదరపు అడుగులైపోతుంది కాబట్టి. హోలు మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏమిటంటే హైకోర్టు తాజా ఆదేశాలు జగన్ ప్రభుత్వం నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. కోర్టు ఆదేశాల వల్ల ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వం నిలిపేస్తుంది. స్ధలాల సేకరణ, లే అవుట్ల సవరణ పేరుతో వచ్చే ఎన్నికల వరకు ఇష్యూని లాగుతుంది. ఈలోగా టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ చేయాల్సిన రాజకీయ రచ్చ మొదలుపెడుతుంది. ఏదేమైనా తాజాగా కోర్టు ఆదేశాలతో పేదలకు ఇళ్ళు ఎప్పుడందుతుందో చూడాల్సిందే.