సొంతింటికే నిప్పంటించుకుంటున్నారా ?

ఆప్ఘనిస్థాన్ లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు వ్యవహారం చూసిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న దేశం ఆఫ్ఘన్ మాత్రమే. ఇలాంటి దేశంలోనే బాంబులు పేలడమంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేలుస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ ఇపుడు మాత్రం తమ దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలే టార్గెట్ గా బాంబులు పేల్చడం గమనార్హం.

ముస్లింల్లో సున్నీలు, షియాలు బలమైన ప్రత్యర్థి వర్గాలు. ప్రస్తుతం దేశంలో సున్ని వర్గానికి చెందిన వారిదే ఆధిపత్యం. తాలిబన్లు, హక్కాని నెట్ వర్క్ లో కూడా సున్నీలదే ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది. అంటే ఒకరకంగా తాలిబన్లు, హక్కానీ నెట్ వర్కనే కాదు మామూలు జనాల్లో కూడా సున్నీ-షియా వర్గాల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉంటాయి. ఇప్పుడు దేశంలో జరిగిందిదే. కుందుజ్ లోని గొజరే సయ్యద్ అబద్ మసీదులో శుక్రవారం ప్రార్ధనలు చేసుకుంటున్న షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొందరు బాంబు పేల్చారు. ఈ దాడిలో కనీసం 100 మంది చనిపోతే మరో 150 తీవ్రంగా గాయపడ్డారు.

బాంబు దాడిలో చనిపోయిన వారంతా షియా వర్గం వారే కాబట్టి బాంబులు పేల్చింది సున్నీ వర్గీయులే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే ఉగ్రవాద గ్రూపు ప్రకటించింది. ఐఎస్ అంటే తాలిబన్లకు బద్ధ విరోధి గా చెప్పుకోవచ్చు. నిజానికి తాలిబన్లపై తాము పై చేయి సాధించాలంటే తాలిబన్లపైన దాడులు చేయాలి కానీ ఏ పాపం తెలీని అమాయకులపైన దాడి చేయటం ఏమిటే ఐఎస్ కే తెలియాలి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే షియాలను టార్గెట్లుగా చేసుకుని ఐఎస్ గ్రూపు చాలా దాడులు చేసింది. షియాలు ఆప్ఘన్లో మైనారిటిలన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఏ విధంగా చూసుకున్నా సున్నీ వర్గానిదే ఆధిపత్యం. మరి ఈ విషయం అందరికీ ఇంత స్పష్టంగా కనబడుతున్నా ఇంకా షియాలపై దాడులు చేస్తున్నారంటే ఉగ్రవాదం అన్నది పాము వ్యవహారంలా తయారైపోయిందని అర్ధమవుతోంది. పాము కూడా ఆకలేస్తే తన పిల్లలను తానే తినేసినట్లు ఉగ్రవాదం కూడా సొంతింటికే నిప్పు పెట్టుకోవటానికి వెనకాడటం లేదని అర్ధమైపోతోంది.