ఉద్యోగ సంఘాల నేతలకు లైవ్‌లో వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే అంతే సంగతులు అన్నట్లే ఉంటోంది పరిస్థితి. ప్రతిపక్ష నేతలను ఈ విషయంలో ఎంతగా అణగదొక్కారో, ఎదురు దాడి చేసి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారో చెప్పడానికి గత రెండున్నరేళ్లలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక సామాన్య జనాలెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వాళ్లకు మరింత దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు తమకెన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నోరు విప్పకుండా సర్దుకుంటూ వచ్చారు ఇన్నాళ్లూ.

గత ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా విరుచుకుపడేవారో తెలిసిందే. తమ డిమాండ్లను చాలా వరకు నెరవేర్చినా, అడగని కోర్కెలు తీర్చినా కూడా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మారి, ఆ ప్రభుత్వం గద్దె దిగడంలో ఉద్యోగ సంఘాలు కీలకంగా మారాయనే అభిప్రాయం బలంగా ఉంది.

కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక హామీలు కానీ, డిమాండ్లు కానీ ఏవీ నెరవేర్చలేదు. పైగా జీతాలే సక్రమంగా చెల్లించని పరిస్థితి. కొన్ని నెలల నుంచి ఒకటో తేదీకి జీతం అనే మాటే మరిచిపోయారు ఉద్యోగులు. ఎవరికి ఎఫ్పుడు జీతాలు పడతాయో, పెన్షన్లు అందుతాయో దైవాదీనంగా మారిపోయింది. ఇక పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు లాంటి అంశాల సంగతి సరేసరి. అయినా సరే.. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటిదాకా నోరు విప్పలేదు.

కానీ పరిస్థితి రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతుండటంతో ఎట్టకేలకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గళం విప్పక తప్పట్లేదు. ఉద్యోగుల జీతాల ఆలస్యం సహా పలు సమస్యలపై ఏపీ రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఐతే ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా మధ్యలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రెస్ మీట్ లైవ్ నడుస్తుండగా.. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడ్డం కనిపించింది. కంట్రోల్లో ఉంటాం సార్ అని శ్రీనివాసరావు అనడం.. మా మీద చాలా ఒత్తిడి ఉంది ఏం చేయమంటారని వెంకటేశ్వర్లు పేర్కొనడం వినిపించింది. ప్రభుత్వంలో పెద్ద స్థాయి వ్యక్తే ఇలా ఫోన్ చేసి ఉద్యోగ సంఘాల నేతల్ని హెచ్చరించిన విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడిన ఓ ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ కార్యక్రమం మధ్యలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఉదంతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి అనుభవాలు నభూతో అంటూ ఉద్యోగులు మథన పడుతున్నారు.