ప‌ద‌వి లేక‌పోతే అంత ఛీపా?

అధికారంలో ఉన్న నాయ‌కులు ఎక్క‌డికెళ్లినా త‌మ మాట నెగ్గించుకోవాల‌ని చూస్తారు. త‌మ ఆధిప‌త్య‌మే చ‌లాయించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. త‌మ పార్టీలో ప‌ద‌వుల్లో లేని నాయ‌కుల‌ను త‌క్కువ చేసి చూసేందుకూ వెన‌కాడ‌రు. ప‌ద‌విలో లేని నాయ‌కుండంటే ప్ర‌జ‌ల్లోనే కాదు సొంత పార్టీలోనే త‌గిన ఆద‌ర‌ణ ఉండ‌ద‌నేది నిజం. ఇప్పుడు ఖ‌మ్మంలోని టీఆర్ఎస్ ప‌రిస్థితి చూస్తే ఇలాగే క‌నిపిస్తోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న‌కు అధికార పార్టీలో గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని టాక్‌. స్వ‌యంగా పార్టీ స‌మావేశంలో పొంగులేటి చేసిన వ్యాఖ్య‌లు ఈ అంశానికి మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి.

ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ స‌మావేశం జ‌రిగింది. ఈ మీటింగ్‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప‌ద‌వి ఉన్నోళ్ల‌కే త‌ప్ప పార్టీని న‌మ్ముకున్న త‌న లాంటి వాళ్ల‌కు గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న త‌న బాధ‌ను బ‌య‌ట‌పెట్టారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో టీఆర్ఎస్ మ‌రోసారి ఒక్క సీటుకే ప‌రిమిత‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. 2018 రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున గెలిచిన పువ్వాడ అజ‌య్‌కుమార్కు మంత్రి ప‌ద‌వి ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇక ప‌ద‌వి లేకున్నా ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని ఇంట్లో ప‌డుకోన‌ని ఎవ‌రికి ఇష్ట‌మున్నా లేకున్నా అలాగే చేస్తాన‌ని పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆ నాయ‌కుడు వ‌స్తే వెళ్ల‌కూడ‌ద‌ని కొంత‌మంది నేతలు కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్ట‌డం స‌రైంది కాద‌ని పొంగులేటి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో పొంగులేటి పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం సాగినా.. ఆయ‌న టీఆర్ఎస్‌నే న‌మ్ముకుని ఉన్నారు. కానీ తాజాగా ఆయ‌న త‌న ఆవేదన కోపాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో ఖ‌మ్మం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. అక్క‌డ పార్టీలోని నాయ‌కుల మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. పొంగులేటి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో నిత్యం ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండ‌డాన్ని సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే జీర్ణించుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌వద్ద‌ని కొన్ని చోట్ల మండ‌ల గ్రామ స్థాయి నేత‌ల‌కు ఆదేశాలు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొన‌కుండా కింది స్థాయి నాయ‌కుల‌ను పార్టీలో పెద్ద నేత‌లు ఒత్తిడి చేస్తున్నార‌ని పొంగులేటి అంటున్నారు. ప‌దవి లేని నాయ‌కుల‌ను మ‌రీ ఛీప్‌గా చూస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు మాజీ ఎంపీ పొంగులేటి మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు ప్ర‌స్తుత మంత్రి పువ్వాడ అజ‌య్ ఎంపీ నామా ఇలా అక్క‌డ టీఆర్ఎస్‌కు కీల‌క‌మైన నాయ‌కులున్నారు. కానీ వీళ్ల‌లో ఇప్పుడు ఎక్కువ మందికి ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో ఖాళీగా ఉండ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడూ ఆధిప‌త్య పోరు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

నియోజ‌క‌వ‌ర్గాల్లో తాజా మాజీల మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లు పోరాటం సాగుతుంద‌ని టాక్‌. నాలుగు ద‌శాబ్దాలుగా ఉమ్మ‌డి జిల్లాలో త‌న ప్రాబ‌ల్యాన్ని చాటుకుంటున్న తుమ్మ‌ల ప్ర‌స్తుతం పాలేరులో పాగా వేసేందుకు అక్క‌డి జ‌నాల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. దీంతో అక్క‌డి ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డితో ఆయ‌న‌కు పొస‌గ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌ల‌గం వెంక‌ట్రావు ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు మ‌ధ్య‌, వైరాలో ఎమ్మెల్యే రాములు నాయ‌క్ మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ మ‌ధ్య వివాదాలు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా అధికార పార్టీ ఖ‌మ్మం జిల్లా నాయ‌కుల్లో నిత్యం ర‌గ‌డ చోటు చేసుకుంటూనే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.