తెలంగాణలో ప‌ద్మశ్రీకి అర్హులు లేరా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల దూకుడు త‌గ్గించారు. గ‌త నెల‌లో ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత‌.. కేంద్రంపైనా.. బీజేపీపైనా.. జాతీయ స్థాయిలో విమ‌ర్వ‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌న పాత ధోర‌ణిలో కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్య వైఖరి అనుస‌రిస్తోంద‌ని నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. టూరిజంతో పాటు పలు విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణ‌లో క‌ళాకారులు, విశిష్ఠ వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని.. అయినా.. కేంద్రం ఎవ‌రికీ ఈ అవార్డులు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “తెలంగాణలో ప‌ద్మశ్రీకి అర్హులు లేరా?.. పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వ‌ద్దా?” అని ప్రధాని మోడీ, అమిత్‌షాను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. అంతేకాదు.. తెలంగాణ చాలా చ‌రిత్ర, సంప్ర‌దాయాలు.. గొప్ప క‌ళ‌ల‌తో కూడుకున్న ప్రాంతమని సీఎం కేసీఆర్ అన్నారు. 58 సంవ‌త్స‌రాలు స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదని విమర్శించారు. అద్భుత‌మైన జ‌ల‌పాతాలు తెలంగాణ‌లో ఉన్నాయన్నారు. ఖ‌మ్మంలో పాండ‌వుల గుట్ట‌ను ప‌ట్టించుకోలేదని విమ‌ర్శించారు.

చారిత్రాక ఉజ్వ‌ల‌మైన అవ‌శేషాలు ఉన్న తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉందని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ‌లోని ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ కాపాడుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తామన్నారు. చారిత్రాక‌ ప్ర‌దేశాలు, కోట‌లు, ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, విశిష్ట‌మైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే.. చాలా రోజుల త‌ర్వాత‌.. కేంద్రంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. తెలంగాణ సంస్కృతి.. సంప్ర‌దాయాలు అంటూ.. తొలిసారి అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వాస్త‌వానికి 2021-22 కు సంబంధించిన ప‌ద్మ అవార్డుల కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడో ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను ప్రారంభించింది. ఇది సెప్టెంబ‌రు 15తో గ‌డువు తీరిపోయింది. ప్ర‌త్య‌కంగా ప్ర‌భుత్వాల నుంచి ఎలాంటి సిఫార‌సుల‌ను తీసుకోబోమ‌ని.. అంద‌రూ పోర్ట‌ల్‌లోనే న‌మోదు చేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. కానీ, కేసీఆర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. మ‌రి దీనిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.