వ్యూహం మార్చిన బాబు – బద్వేల్ కు బై చెప్పేశారు

కొన్ని సందర్భాల్లో సంప్రదాయాన్ని.. మరికొన్ని సందర్భాల్లో అలాంటివాటిని పట్టించుకోని తత్త్వం కొందరు అధినేతల్లో ఈ మధ్యన కనిపిస్తోంది. అందుకు భిన్నంగా తాను వ్యవహరిస్తానన్న విషయాన్ని తన చేతలతో మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. విపక్షంగా ఉన్న తెలుగు దేశం త్వరలో జరిగే బద్వేల్ ఉప ఎన్నిక పోటీకి తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించారు చంద్రబాబు. దీనికి కొట్టేయలేని కారణాన్ని చెప్పిన ఆయన.. తెలివిగా వ్యవహరించారని చెప్పాలి.

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం పాటు.. ఎవరైనా ప్రజాప్రతినిధి అనుకోనిరీతిలో మరణించి.. సదరు స్థానం ఖాళీ అయినప్పుడు.. ఆ సీటును ఆ నేత కుటుంబానికి తిరిగి ఇస్తే పోటీ చేయకుండా ఉండటం ఒక సంప్రదాయంగా కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగిన ఈ ఏడేళ్లలో ఏపీలో ఈ విధానం అమలైనా.. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఈ సంప్రదాయాన్ని తోసి రాజన్నట్లుగా వ్యవహరించటంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందున్నారని చెప్పాలి.

తాజాగా మాత్రం బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం చంద్రబాబు సంప్రదాయాన్ని గుర్తు చేసి.. పోటీకి దూరంగా ఉండటం ద్వారా తెలివిగా బయటపడ్డారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అధికార పార్టీకి ఉన్న బలం.. విపక్షానికి లేదనే చెప్పాలి. దీనికి తోడు.. కడప జిల్లాలో అధికార వైసీపీని కాదని.. పోటీ చేసిన విజయాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ పోటీ చేసినా.. చేతిలో చమురు వదల్చుకోవటంతో పాటు.. పార్టీ క్యాడర్ ను మరింత దిగాలు పరచటం మినహా సాధించేది ఏమీ ఉండదు.

బద్వేల్ లో ఎవరెంత చేసినా.. వైసీపీ అభ్యర్థి విజయం సాధించటం ఖాయం. ఈ విషయంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటిస్తే.. తాజాగా పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పోటీకి తాము దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. సంప్రదాయాలను గౌరవించే తాము బద్వేల్ లో పోటీ చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

వాస్తవానికి పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు.. బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను టీడీపీ ఎంపిక చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఈ స్థానానికి మరణించిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే అధికార వైసీపీ టికెట్ ఇవ్వటంతో తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు బాబు చెప్పారు. జనసేన అధినేత పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పిన నేపథ్యంలో.. ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. నిజానికి ఉప ఎన్నిక విషయంలో రాజకీయ పార్టీలు సంప్రదాయాన్ని పాటించటం మంచిదే. అనవసరమైన ఉద్రిక్తతలు.. ఖర్చు తలపోటు కంటే పాత విధానాల్ని కంటిన్యూ చేయటమే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోంది.