ట్విస్ట్‌- యాత్ర చేసిది లోకేష్ కాదు, బాబే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి ఆ సంతృప్తితో రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల‌ని భావిస్తున్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి నుంచే 2024 ఎన్నిక‌ల‌పై బాబు దృష్టి సారించారు. ఆ క్ర‌మంలోనే రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జీల‌ను మారుస్తున్నారు. సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి పార్టీని గెలిపించేందుకు శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేసే స‌త్తా ఉన్న యువ‌కుల‌కు బాబు అవ‌కాశం ఇస్తున్నారు. మ‌రోవైపు త‌న త‌న‌యుడు లోకేశ్‌ను ప్ర‌జ‌ల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా జ‌గ‌న్‌ను దెబ్బ‌కు దెబ్బ తీయాల‌నే ప్ర‌తీకారంతో ఉన్న ఆయ‌న త‌న సొంత వ్యూహాల‌తోనే ముందుకు సాగుతున్నారు.

కొంత‌కాలంగా త‌న వ్యూహాన్ని మార్చిన బాబు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండ‌టానికి మీడియా ముందుకు రావ‌డానికి ఇష్టప‌డ‌డం లేదు. ఎప్పుడూ మీడియా స‌మావేశాల‌తో బిజీగా గ‌డిపే బాబు ఒక్క‌సారిగా అలా ఎందుకు మారారు? అనే విష‌యంపై చ‌ర్చ కూడా సాగుతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలోనూ గంట‌ల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి తాను చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాల‌తో పాటు త‌న విజ‌న్‌ను వివ‌రించేవారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే స్పందించేవారు. ప‌థ‌కాల ప్రారంభోత్స‌వంలో స్వ‌యంగా పాల్గొనేవారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న పంథా మార్చుకోలేదు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌డుతూ మీడియా స‌మావేశాలు పెట్టారు. క‌రోనా స‌మ‌యంలోనూ జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. కానీ ఇలా ఊరికే మీడియా ముందుకు వ‌స్తే ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌నైపోతార‌ని భావించిన ఆయ‌న ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు త‌న వ్యూహాన్ని మార్చాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు. కొద్ది రోజులుగా ప్ర‌జ‌ల ముందుకు రాని బాబు స్వ‌యంగా జ‌నాల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పీడిత ప్ర‌జ‌ల స‌మస్య‌ల ప‌రిష్కారానికి త్వ‌ర‌లోనే ప్ర‌జాయాత్ర ప్రారంభిస్తామ‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు బాబు చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు తొమ్మిదేళ్లు నిండిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో బాబు ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే గ‌తంలో లోకేష్ యాత్ర చేస్తారనే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు త‌న‌యుడిని కాద‌ని బాబే యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

తానే స్వ‌యంగా యాత్ర చేస్తే టీడీపీ నాయ‌కుల్లో కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంద‌ని పార్టీని తిరిగి యాక్టివ్‌గా చేయడానికి వీలు అవుతుంద‌ని బాబు భావించ‌డ‌మే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి రావ‌డం ఖాయ‌మైంది. కాక‌పోతే బాబు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తారా? ఈ వ‌య‌సులో అంత రిస్క్ తీసుకుంటారా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. మ‌రోవైపు బాబు రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేప‌డ‌తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డం కోసం ప్ర‌జ‌ల్లోకి బాబు రాబోతుండ‌డంతో టీడీపీలో మళ్లీ స‌రికొత్త ఉత్సాహం క‌నిపించ‌నుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు సంబ‌ర ప‌డుతున్నారు.