పార్టీలను వణికిస్తున్న ఎంఐఎం

తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం మిగిలిన పార్టీలను వణికించేస్తోంది. ముస్లిం ఓట్లను దక్కించుకోవటమే టార్గెట్ గా ఎన్నికల్లో పోటీచేయబోతున్న ఎంఐఎం వల్ల ఏ పార్టీకి దెబ్బపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ప్రతి పార్టీ కూడా ఎంఐఎం వల్ల తమకేమీ నష్టం జరగదని చెప్పుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యూపీలో చాలా కులాలకు ప్రత్యేకించి పార్టీలున్నాయి, గట్టి నేతలూ ఉన్నారు.

కానీ ముస్లింలకు మాత్రం ఏకీకృతపార్టీకానీ లేదా అందరినీ కలుపుకుని పోగలగిన గట్టినేత కానీ ఇప్పటివరకు లేరు. ఆ లోటును తమ పార్టీ భర్తీ చేస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం తరపున 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పోటీచేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. యూపీలో కులాల వారీగా చూస్తే జాతవ్, యాదవ్, రాజ్ బర్, నిషాద్ సామాజికవర్గాలకు ప్రత్యేకించి పార్టీలున్నాయి. అలాగే వాటికి గట్టి నేతలూ ఉన్నారు.

కానీ రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింలకు మాత్రం ప్రత్యేకంగా పార్టీ లేదు, గట్టి నేతాలేరు. ఈ విషయం మీద అసద్ బాగా ఆలోచించినట్లున్నారు. అందుకనే క్షేత్రస్ధాయిలో సర్వే చేయించుకుని యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ ఎంతో ప్రతిష్టగా తీసుకున్న అయోధ్య నుండే యూపీలో పాదయాత్రను అసద్ మొదలుపెట్టారు. మార్గమద్యంలో వచ్చే నియోజకవర్గాల్లో ముస్లిం సమాజంలోని పెద్దలు, కీలక వ్యక్తులు, ఇత పార్టీల్లోని నేతలు, మామూల జనాలను కలుస్తున్నారు.

ముస్లింలకు ప్రత్యేకంగా పార్టీ అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ అవసరాన్ని ఎంఐఎం తీరుస్తుందని భరోసా ఇస్తున్నారు. ఎంఐఎం పోటీచేయబోయే 100 నియోజకవర్గాల్లో కనీసం 80 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే ఎక్కువ. ముస్లిం ఓట్లలో ఎక్కువ ఎవరికి పడితే వారిదే గెలుపు. అందుకనే తాను టార్గెట్ చేసిన 100 నియోజకవర్గాలపైనే అసద్ ఎక్కువగా దృష్టిపెట్టారు. అసద్ సమావేశాలకు ముస్లిం కమ్యూనిటి సానుకూలంగా స్పందిస్తోంది. ఈ కారణం వల్లే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ బాగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఎందుకంటే ముస్లింలు సంప్రదాయకంగా పై మూడుపార్టీలకు ఓట్లేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కూడా చాలా చోట్ల ముస్లింలు మద్దతు ఇచ్చారు. మెజారిటి ముస్లింలు ఓట్లేసిన కారణంగానే వాళ్ళ సామాజికవర్గం ఎక్కువున్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచింది. అయితే బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎక్కడా ముస్లింలకు టికెట్లివ్వలేదు.

దాంతో రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వాలా ? అవసరంలేదా అనే విషయాన్ని బీజేపీ తేల్చుకోలేకపోతోంది. అలాగే ముస్లింలు తమకు మద్దతుగా నిలబడతాయా లేదా అనేది పై మూడు పార్టీలను గందరగోళంలో పడేశాయి. మొత్తానికి ఎంఐఎం అన్నీపార్టీలను వణికించేస్తున్నది మాత్రం వాస్తవం.