నానీ మాటలకు అర్ధమేమిటో ?

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలకు అర్ధమేమిటి ? అనే సందేహం పెరిగిపోతోంది. ‘మంత్రిపదవి మీద ప్రేమ ఎందుకుంటుంది ? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. దాంతో మరోసారి తొందరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ మధ్యనే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తొందరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో నూరుశాతం కొత్తవారు వస్తారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి మంత్రివర్గంలో ఎవరుండాలి ? అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే. కాకపోతే ఎవరికి వారు తమను మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తారని అనుకోవడం కూడా సహజమే. కానీ ఇక్కడ మాత్రం తొందరలో మంత్రులందరినీ తీసేసి కొత్తవారిని జగన్మోహన్ రెడ్డి తన జట్టులోకి తీసుకుంటారని బాలినేని చెప్పటంతో మంత్రివర్గం హీట్ పై చర్చలు ఒక్కసారిగా పెరిగిపోయింది. మంత్రులుగా ఉన్న వారిలో మాజీలైన కొందరిని పార్టీ సేవలకు జగన్ ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అలాంటి వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని, బుగ్గన రాజేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అయితే ఇదే సమయంలో పేర్ని, పెద్దిరెడ్డి, కొడాలి మంత్రివర్గంలో కంటిన్యూ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తానని జగన్ చెప్పలేదు. పనితీరు ఆధారంగా కొందరిని మాత్రం ఉంచుకుని మిగిలిన వారిని మార్చేస్తానని మాత్రమే చెప్పారు.

రెండు రకాలుగా జరుగుతున్న ప్రచారాల మధ్య హఠాత్తుగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది ? అన్నది నిజం కాదు. రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ఎంఎల్ఏగా గెలవటం, మంత్రవ్వటం అన్నది పెద్ద కల. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి అందులోను పార్టీ అధినేతలకే అవకాశాలుంటాయి. కాబట్టి మిగిలిన వారిలో ముందు ఎంఎల్ఏ అవటం తర్వాత మంత్రిగా పనిచేయాలని బలంగా ఉంటుంది.

కానీ పేర్ని నాని మాత్రం రివర్సులో ఆలోచిస్తున్నారంటే తనను తప్పించటంపై మంత్రికి స్పష్టమైన సంకేతాలు ఏమైనా అందాయా అన్నది అర్ధం కావటంలేదు. ఏదేమైనా మంత్రిగా ఉన్నా లేదా పార్టీ పదవిలో ఉన్న పేర్ని గట్టిగానే పనిచేస్తారనే వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే మాటకారి, పాయింట్ టు పాయింట్ సరిగ్గా మాట్లాడగలరు, ప్రత్యర్ధులకు సూటిగా సమాధానం చెప్పగలరు. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతునే సెటైర్లు వేయగలరని అందరికీ తెలిసిందే. సో తొందరలోనే మంత్రి మాటలే నిజమైతే పార్టీ పదవిలో చూడాల్సుంటుందేమో.