రాహూల్, ప్రియాంకలకు పెద్ద షాక్

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఒకేసారి షాకిచ్చిన ఘనత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి మాత్రమే దక్కుతుంది. తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ రాజీనామా చేయడం నిజంగా అగ్రనేతలకు షాకిచ్చే అంశమే అని చెప్పాలి. సిద్ధూ రాజీనామా చేస్తే అగ్రనేతలు ఇద్దరికీ ఏ విధంగా షాకంటే మొదటి నుంచి సిద్ధూకి బాగా ప్రాధాన్యత ఇచ్చి పంజాబ్ కాంగ్రెస్ ను కంపు చేయటంలో వీళ్ళది కూడా ప్రముఖ పాత్ర కాబట్టే. కెప్టెన్ అమరీందర్ సింగ్ తో పడని కారణంగా సీఎంగా ఆయన రాజీనామా చేసే వరకు సిద్ధూ నిద్రపోలేదు.

కెప్టెన్ కు సోనియాగాంధీ ఎంతగా కాపాడాలని అనుకున్నా రాహుల్, ప్రియాంకల పై సిద్దు పెట్టిన ఒత్తిడి కారణంగా చివరకు సోనియా లొంగిపోవాల్సొచ్చింది. ఫలితంగా అమరీందర్ సీఎంగా రాజీనామా చేయాల్సొచ్చింది. అసలు సిద్ధుని పీసీసీ అధ్యక్షుడిగా చేయద్దని కెప్టెన్ నెత్తీ నోరు మొత్తుకున్నారు. సిద్ధు ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదని కెప్టెన్ ఎంత మొత్తుకున్నా సోనియాను కాదని రాహుల్, ప్రియాంక సిద్ధుకి పార్టీ పగ్గాలు అప్పగించారు.

అంటే కేవలం సిద్ధూకి పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే తమ తల్లి సోనియాపై బాగా ఒత్తిడి పెట్టి, మాజీ సీఎం అమరీందర్ ను అన్నా, చెల్లెళ్ళు లెక్కచేయలేదు. తర్వాత సిద్ధూ కోసమనే అమరీందర్ రాజీనామా చేసేట్లుగా ఒత్తిడిపెట్టారు. సిద్ధూ కోసమని ఇంత చేసిన రాహుల్, ప్రియాంకలకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండానే పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధు రాజీనామా చేసేశారు. అంటే తనకోసం అంతచేసిన అన్నా, చెల్లెళ్ళకు సిద్ధు ఏమాత్రం విలువ ఇవ్వలేదని ప్రపంచానికి తెలిసిపోయింది.

తన రాజీనామాతోనే సిద్ధూ అగ్ర నేతలైన అన్నా, చెల్లెళ్ళను ఏకకాలంలో బకరాలను చేసినట్లయ్యింది. పార్టీకి, నాయకత్వానికి ఎంతో కమిటెడ్ గా ఉన్న అమరీందర్ తో బలవంతంగా రాజీనామా చేయించిన ఖ్యాతి రాహుల్, ప్రియాంకలకే దక్కుతుందనటంలో సందేహమే లేదు. ఇంతకీ అసలు సిద్ధూ పార్టీ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేసినట్లు ? ఎందుకంటే కొత్తగా సీఎం అయిన చరణ్ సింగ్ చన్నీ విషయంలో సిద్ధు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

చరణ్ సింగ్ ను సీఎంగా అంగీకరించలేకే పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధు రాజీనామా చేశారట. మాజీ సీఎం అమరీందర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బహుశా చరణ్ స్ధానంలో తననే అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందని సిద్ధూ అనుకున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ దిశగా సిద్ధూ-రాహుల్, ప్రియాంక మధ్య చర్చలు ఏమైనా జరిగాయా అన్నది తెలీదు. మొత్తానికి సీఎం పదవిని ఆశించి అది దక్కకపోవటంతోనే హఠాత్తుగా పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారని అర్ధమైపోయింది.