నటుడు, రచయిత, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళికి, పవన్ కళ్యాణ్కి మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం ప్రెస్మీట్ పెట్టి మరీ పవన్పై విరుచుకుపడిన పోసాని, మంగళవారం మరోసారి మండిపడ్డారు. గత ఇరవై నాలుగ్గంటల్లో తనకి చాలా బెదిరింపులు వచ్చాయని, అందుకే మళ్లీ మీడియా ముందుకు వచ్చానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పవన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు పోసాని. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదని, ఇండస్ట్రీ మనిషి అసలే కాదని, ఆయనకి తనమీద తనకి తప్ప ఎవరి మీద ప్రేమ లేదని అన్నారు పోసాని. ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని ఆయనకి, ప్రజల కోసం వేల కిలోమీటర్లు నడిచి జగన్తో పోలికేంటంటూ హేళనగా మాట్లాడారు.
‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ కక్షకట్టి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. పవన్ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారు. కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీని, కొన్నాళ్లు బీజేపీని విమర్శించారు. ఇప్పుడు వైకాపాను విమర్శిస్తున్నారు. నేను జగన్ అభిమానిని. ఆయనను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది’ అన్నారు పోసాని. తనకీ చిరంజీవికి కూడా రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా మంచిగానే ఉంటామని, ఏం చెప్పినా విని అర్థం చేసుకునే పరిణతి చిరంజీవికి ఉంది కానీ పవన్ కళ్యాణ్కి లేదని అన్నారు.
అయితే, పవన్ అభిమానులు తనపై చూపిన కోపం తిట్లు… మొత్తం పవన్ పై కక్కేశారు పోసాని. పోసాని మాటలు రాయడానికి మాకూ ఇబ్బందే, చదవడానికి మీకూ ఇబ్బంది… అత్యంత దారుణమైన డి గ్రేడ్ భాషతో పవన్ పై పోసాని విరుచుకుపడ్డారు. పంజాబీ అమ్మాయిని మోసం చేశాడని, కర్ర పుల్లకు చీరకట్టినా అమ్మేయేనా అని ఎత్తి చూసే రకమని, నీకు కూతురు ఉంది, అది పెద్దది అవుతుంది, అపుడు నేను చూస్తా నీ రక్తకన్నీరు అని అంటూ ఇంత కంటే ఘోరమైన బజారు పదాలు చాలానే వాడారు. ఆయన బూతులు టీవీల్లో చూసినవారు కూడా ఛానెల్ మార్చే పరిస్థితి వచ్చింది.
జగన్ అవినీతికి పాల్పడితే వాటిని నిరూపించాలే తప్ప ఇలా అర్థం లేని ఆరోపణలు చేయకూడదని పోసాని అన్నారు. విమర్శలు తట్టకోలేనివాడికి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావ్ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఎప్పుడు ప్రశ్నించాలి, ఎక్కడ ప్రశ్నించాలి అనేది నీకు తెలీదు. మిమ్మల్ని మారమని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు మారరని నాకు తెలుసు. కాస్త విజ్ఞతతో మాట్లాడండి చాలు’ అన్న పోసాని.. కేవలం ప్రశ్నించినందుకు గాను పవన్ ఫ్యాన్స్ తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని చెప్పారు. ‘పవన్ కళ్యాణ్.. నీ సైకో ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక నుంచి రాజకీయాల్లో నా గురించి మాట్లాడు. నన్ను టార్గెట్ చెయ్యి. నాది తప్పయితే నీకు దణ్నం పెడతాను. అంతే కానీ నా కుటుంబ సభ్యుల్ని లాగొద్దు’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.
పోసాని ప్రెస్క్లబ్లో ఉన్నారని తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకుని అక్కడ నిరసనకు దిగారు. అయితే, ప్రెస్ మీట్లో ఇంకా దారుణంగా తిడుతున్నాడని యుట్యూబుల్లో అక్కడే చూసిన వారంతా ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పవన్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తాను చనిపోతే అందుకు పవన్ కళ్యాణే కారణమని పోసాని అన్నారు. రేపు పవన్ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తానని చెప్పారు.
మొత్తానికి ఇండస్ట్రీ కోసం పవన్ చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదం చాలా అగ్లీ టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. గతంలో కత్తి మహేష్ కు పవన్ అభిమానులకు తలెత్తన వివాదం వంటిదే ఇపుడు పవన్ అభిమానులకు పోసానితో తలెత్తిందని అర్థమవుతుంది. మరి ఇది ఎక్కడ ఆగుతుందో, ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి. పవన్ అభిమానులు కూడా ఆయనకు బలమూ బలహీనత రెండూనూ అనుకోవాల్సి వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates