మంత్రి మల్లారెడ్డిని మందలించిన కేసీఆర్, కేటీఆర్!

మంత్రి మల్లారెడ్డిది ప్రత్యేకమైన స్టైల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. అది అసెంబ్లీ కావచ్చు.. మీడియా సమావేశం కావచ్చు… మీడియాను తనవైపు తిప్పుకోవడంలో ఆయన నేర్పిరి అని కొనియాడేవారు లేకపోలేదు. ఇలా మాట్లాడితే చిక్కుల్లో పడుతారనే హెచ్చరించేవారు ఉన్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తప్ప మరెవరూ మల్లారెడ్డిని వెనుకేసుకుని రాలేదు. అయితే మంత్రిగా ఉంటూ సొంత నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నేతలను మల్లారెడ్డి కలుపుకుని పోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో అధిష్ఠానం ఎట్టకేలకు జోక్యం చేసుకుందని చెబుతున్నారు.

కేటీఆర్‌తో మల్లారెడ్డి, శరత్‌చంద్రారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో కలిసికట్టుగా ఉండాలని, పార్టీ కార్యక్రమాలు సంయుక్తంగా చేయాలని ఇద్దరికి కేటీఆర్ చెప్పారని చెబుతున్నారు. మాటల సందర్భంలో మల్లారెడ్డికి గట్టిగానే కేటీఆర్ క్లాస్ పీకారని చెబుతున్నారు. ఈ భేటీలో మల్లారెడ్డికి కేటీఆర్ ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నామని, ఈ విషయాన్ని కేసీఆర్‌ ముందు మీరే చెప్పాలని మల్లారెడ్డిని కేటీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ తర్వాత మల్లారెడ్డి, కేసీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుపోవాలని కేసీఆర్, మల్లారెడ్డిని ఆదేశించారని చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మరోసారి భేటీ అవుదామని మల్లారెడ్డితో కేసీఆర్ చెప్పారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మల్లారెడ్డి టీఆర్‌ఎస్ చేరినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య సఖ్యత లేదని ప్రచారం ఉంది. ఎందుకంటే మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ను కాదని కేసీఆర్, మల్లారెడ్డిని ఆ స్థానంలో నిలబెట్టారు. సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోయేందుకు సిద్ధమయ్యారనే చర్చ కూడా నడిచింది. సుధీర్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేశారనే వాదన కూడా ఉంది.

మల్లారెడ్డిని గెలిపించుకోవడం కోసం సుధీర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. సీఎం హామీతో సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోనే కొసాగుతున్నారు. మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి మధ్య వివాదానికి తెరపడకముందే… మల్లారెడ్డి వర్సెస్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారయిందని టీఆర్‌ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ ఈ వివాదాన్ని ఏ మాత్రం పరిష్కరిస్తారో వేచిచూడాలి.