తాజా ట్విస్ట్ : ఆ స్నేహం.. శత్రుత్వంగా మారె!

ఆ ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కులే.. త‌మ సామాజిక వ‌ర్గాల్లో గొప్ప ప‌ట్టున్న నేత‌లు. కొన్నాళ్లూ ఒకే పార్టీలో క‌లిసి ప‌ని చేశారు. ఏ కార్య‌క్ర‌మ‌మైనా ఇద్ద‌రు క‌లిసే వెళ్లేవాళ్లు. స్నేహంతో సాగారు. కానీ ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తి దూసుకునేందుకు సిద్ధ‌మ‌యారు. రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డేందుకు క‌దులుతున్నారు. పొలిటిక‌ల్ చెస్‌లో ఒక‌రిపై మ‌రొక‌రు ఎత్తులు వేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ మంత్రి కొడాలి నాని కాగా.. మ‌రొక‌రు టీడీపీ కీల‌క నేత వంగ‌వీటి రాధా.

కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ఎప్పుడూ ర‌స‌వ‌త్తరంగానే ఉంటుంది. 2004 నుంచి అక్క‌డ కొడాలి వెంక‌టేశ్వ‌ర్‌రావు (కొడాలి నాని)కి తిరుగులేదు. 2004, 2009 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసిన ఆయ‌న వ‌రుస విజ‌యాలు సాధించారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య దుందుభి మోగించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో పౌర స‌ర‌ఫ‌రాలు వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిగా కొన‌సాగుతున్నారు. రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నాని.. మాజీ మ‌ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. బాబు, లోకేష్‌తో పాటు టీడీపీపై నాని నిప్పులు చెరిగేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఆయ‌న స్నేహితుడు వంగ‌వీటి రాధాను బ‌రిలో దింపాల‌ని బాబు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఉంటే గుడివాడ‌లో నానికి తిరుగులేకుండా పోయింది. అందుకే వ‌రుస ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విజ‌యాలు ద‌క్కుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు పోటీగా విజ‌య‌వాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకొచ్చి బ‌రిలో దించి చేతులు కాల్చుకున్న టీడీపీ.. ఇప్పుడు సామాజిక వ‌ర్గం వేరేదైనా స‌రే నానికి పోటీగా నిలిచే నాయ‌కుడి కోసం వెతికి వంగ‌వీటి రాధాకృష్ణ‌ను ఎంచుకుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన కాపు నేత వంగ‌వీటి రాధా గ‌తంలో వైసీపీలో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌లో చేర‌తార‌నే ప్ర‌చారం సాగిన‌.. ఆయ‌న ఆ వైపు వెళ్ల‌లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోనే చేరారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని ఆయ‌న స్టార్ క్యాంపెన‌యిర్‌గా మాత్రం క‌నిపించారు.

ఇప్పుడిక నానికి పోటీగా ఆయ‌న‌ను గుడివాడ‌కు పంపించాల‌ని బాబు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని కాపు సామాజిక వ‌ర్గంలో రాధాకు మంచి ప‌ట్టుంది. దీంతో ఆయ‌న్ని బ‌రిలో దింపితే నానికి చెక్ పెట్టిన‌ట్లు అవుతుంద‌ని పార్టీ భావిస్తోంది. మ‌రోవైపు రాధా కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే గుడివాడ నియోజ‌క‌వర్గానికి వెళ్లి అక్క‌డి కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం రెడీగా ఉండాల‌ని వాళ్ల‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గుడివాడ‌లో టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌నున్నార‌నే సంకేతాల‌ను రాధా ఇచ్చార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ స‌మావేశంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితుల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చిన ఆయ‌న‌.. త‌న వ్యూహాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. కొడాలి నానికి అన్ని విధాలుగా రాధానే స‌రైన ప్ర‌త్య‌ర్థి అని భావిస్తున్న టీడీపీ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.