జగన్ ఏమని సమర్ధించుకుంటారు ?

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించటంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రతిపక్షాలు చాలెంజ్ చేస్తు హైకోర్టులో కేసులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలో లేకపోతే ఎవరితోనో కోర్టుల్లో కేసులు వేయించటం వెంటనే కోర్టులు స్టే ఇచ్చేయటం చూస్తున్నదే.

ఇదే పద్దతిలో ఇపుడు కూడా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో చాలెంజ్ చేశారు. అంతకుముందే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆధ్వర్యంలో కొందరు నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి జంబో ట్రస్టుబోర్డు ఏర్పాటుపై ఫిర్యాదు కూడా చేశారు. కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, టీటీడీ స్వతంత్రత దెబ్బతింటుందని పిటీషనర్ ఫిర్యాదుచేశారు. అయితే పిటీషనర్ చెప్పినట్లుగా భక్తుల మనోభావాలు దెబ్బతినేది లేదు, టీటీడీ స్వతంత్రత దెబ్బతినేదీ లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వ్యతిరేకించాల్సిందే అన్నట్లుంది ప్రతిపక్షాల వ్యవహారం. ఇపుడు నియమించిన బోర్డులో అవినీతిపరులు, దళారీలు ఉన్నారంటు చంద్రబాబునాయుడు అండ్ కో నానా గోలచేస్తున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నియమించిన బోర్డులో కూడా ఇలాంటివారున్నారు. రాయపాటి సాంబశివరావు వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టారు.

ఈయనపై బ్యాంకులు ఫిర్యాదులు చేస్తే సీబీఐ కేసు నమోదుచేసి బ్యాంకుల నుండి తీసుకున్న డబ్బును ఎగ్గొట్టింది నిజమే అని తేల్చింది. అలాగే ఓటుకునోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్యను చంద్రబాబు బోర్డు మెంబర్ గా ఎలా నియమించారు ? వెతుక్కుంటు పోతే ప్రతి ఒక్కరిలోను ఏవో బొక్కలుంటాయని మరచిపోకూడదు. కాకపోతే ట్రస్టుబోర్డులో సభ్యుల వల్ల టీటీడీకి ఏమైనా ఉపయోగం జరిగిందా ? అనే చూడాలి.

చంద్రబాబు, జగన్ నియమించిన బోర్డుల్లోని సభ్యుల వల్ల దేవస్ధానంకు జరిగిన మేలు ఇది అని ఎక్కడా కనబడబలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంత జంబోసైజులో ట్రస్టుబోర్డును నియమించాల్సిన అవసరమైతే లేదు. బోర్డు సైజు పెరిగేకొద్దీ టీటీడీకి నష్టమే కానీ ఉపయోగం ఏమీ ఉండదు. మరి తాను నియమించిన జంబోబోర్డుకు హైకోర్టు బ్రేకులు వేసింది. మరి దీన్ని కోర్టులో జగన్ ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.