జ‌గ‌న్‌కు హైకోర్టు షాక్‌.. టీటీడీ బోర్డు జీవోల ర‌ద్దు!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తాజాగా హైకోర్టు మ‌రోషాక్ ఇచ్చింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి నియామ‌క జీవోల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ కేబినెట్‌ను మించిపోయిన సంఖ్య‌లో నియమించిన బోర్డు వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. జంబో బోర్డును ఎందుకు వేశారంటూ.. ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కామెంట్లు చేసింది. దీనినిలోతుగా ప‌రిశీలించాల్సి ఉంద‌న్న ధ‌ర్మాస‌నం.. రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌న్న పిటిష‌న‌ర్ వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం దీనిపై జారీచేసిన ప్ర‌త్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను ర‌ద్దు చేసింది.

విష‌యం ఏంటంటే..
ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వం టీటీడీ బోర్డుకు సంబంధం ప్రత్యేక పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన బోర్డు స్వరూప స్వభావాలకే కొత్త నిర్వచనం ఇచ్చారు. తమకు నచ్చిన వారిని, తమకు సహాయం చేసిన వారిని, తాము సహాయం పొందాలనుకునే వారిని సంతృప్తి పరిచే ప్రత్యేక కూటమిని తయారు చేశారు. టీటీడీ బోర్డులో గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

గ‌తంలో ఏం జ‌రిగింది.. వెయ్యి మంది పోటీ!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు అంటే ఒక పేరు, ఒక ప్రతిష్ఠ! స్వామికి దగ్గరయ్యేందుకు అదొక మార్గం! అందుకే… రాజకీయ నాయకుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అనేక మంది టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పడతారు. ఇది ఏ ప్ర‌భుత్వానికైనా సంక‌ట ప‌రిస్థితే. అయిన‌ప్ప‌టికీ.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆచి తూచి వ్య‌వ‌హ‌రించింది. ఒకానొక ద‌శ‌లో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తిని చైర్మ‌న్‌గా నియ‌మించిన‌ప్పుడు.. ఏకంగా వెయ్యి మంది ఈ బోర్డు లో సీటు కోసం చంద్ర‌బాబుపై ఒత్తిడి చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు హ‌ద్దులు దాట‌కుండా.. కొంద‌రిని నొప్పించైనా.. బోర్డును ప‌రిమిత సంఖ్య‌లోనే ఏర్పాటు చేశారు.

జ‌గ‌న్ అలా చేయ‌లేదు..

అయితే.. జ‌గ‌న్ స‌ర్కారుకు కూడా టీటీడీ బోర్డు ప‌రీక్ష పెట్టింద‌నేచెప్పాలి. దాదాపు ఈ ద‌ఫా అంతే సంఖ్య‌లో అంటే.. 900 మంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. వీటిలో మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వ‌ర‌కు సిఫార‌సులు వ‌చ్చాయి. దీంతో వారి విన‌తిని ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోయిన జ‌గ‌న్‌.. శ్రీవారి సేవలో తరించాల్సిన ఈ బోర్డును కూడా ఒక ‘ప్రత్యేక దర్శన పునరావాస’ కేంద్రంగా మార్చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏకంగా 81 మందితో ఒక జంబో మండలిని తయారు చేశారు. ఒక చైర్మన్‌, 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు… ఇలా 31 మందితో బోర్డు ఏర్పాటైంది. వీరు చాలదని… ఏకంగా 50 మందిని మరింత ‘ప్రత్యేకంగా’ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

కోర్టుకెక్కిన పంచాయ‌తీ..

గ‌తంలో న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌స్తాయ‌ని గుర్తించిన చంద్ర‌బాబు పెద్ద బోర్డు ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టారు. కానీ, జ‌గ‌న్ కోర్టు ఏం చేస్తుందిలే అనుకున్నారో .. ఏమో.. రాజకీయ అవసరాలతోపాటు తమకు నచ్చిన వారిని, తమకు సహాయం చేసిన వారిని, తమకు సహాయం చేయగలిగే వారిని సంతృప్తి పరిచేందుకు.. అన్ని సిఫారసుల మేరకు టీటీడీ నెత్తిన ఈ జంబో పాలక మండలిని కూర్చోబెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్ర‌స్తుతం హైకోర్టు దెబ్బ‌తో ఇప్పుడు జ‌గ‌న్ ఇరుకున ప‌డ్డారు.