టీడీపీ-జ‌న‌సేన.. ట్ర‌య‌ల్ ర‌న్ ఓకే… ఇక‌.. ఒక్క‌టే మిగిలింది…!


రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు పై మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రో ప‌క్షం జ‌న‌సేలు.. ముసుగులు తీసేస్తే.. ఇక‌, తిరుగు లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లే కాకుండా.. కొన్నాళ్ల కింద‌టే జ‌రిగిన మునిసిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. (స్థానికంగా నేత‌లు చేతులు క‌లిపార‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. పార్టీలు ప్ర‌క‌టించుకున్నాయి). అయితే.. నాయ‌కులు మాత్రం వారికి సంపూర్ణంగా స‌హ‌క‌రించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. పార్టీల అధినాయ‌కులు.. మాత్రం దూరంగానే ఉన్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీలకులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు చూపించినా.. వైసీపీ పాల‌న అద్భుతంగా ఉంద‌ని చెప్పుకొన్నా..కొన్ని చోట్ల‌.. జ‌న‌సేన‌+ టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. అలాంటి చోట వైసీపీకి చుక్కలు క‌నిపించాయి. ఇలాంటి నాలుగు మాత్ర‌మే ఉండొచ్చు.. కానీ… వీటిని ఆధారంగా చేసుకుంటే.. రాష్ట్రంలో అధికార మార్పిడి ఈజీనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు మంచి ఎడ్జ్ క‌నిపిస్తోంది. 2014లో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఇప్పుడు కూడా ఉభ‌య గోదావ‌రులు, విశాఖ‌, సీమల్లో.. ఈ రెండు పార్టీల‌కు బాగానే ఫాలోయింగ్ ఉంది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ట్ర‌య‌ల్ ర‌న్‌గా భావిస్తే.. ఈ ర‌న్‌లో ఈ రెండు పార్టీలూ స‌క్సెస్ అయ్యాయి. సో.. ఇప్ప‌టికైనా.. పార్టీలుచేతులు క‌లుపుకొని.. ఉమ్మ‌డి వ్యూహంతో ముందుకు సాగితే.. ప్ర‌భుత్వ ఏర్పాటు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014లో జ‌రిగింది ఇదే. అయితే.. అప్ప‌ట్లో జ‌న‌సేన ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఎవ‌రికివారుగా పోటీ చేశారు. ఇక‌, ఇప్పుడు.. వీరు క‌లిస్తే.. ఫ‌లితం బాగుంటుంద‌ని అంద‌రూ అంటున్నారు.

మ‌రోవైపు.. జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీకి స‌రైన మార్కులు ప‌డ‌క‌పోవ‌డం.. వారిసిద్ధాంతాల‌తో ఇటీవల కాలంలో జ‌న‌సేన నేత‌లు విభేదిస్తున్న నేప‌థ్యంలో బాబు-ప‌వ‌న్ భేష‌జాలు ప‌క్క‌న పెడితే.. స‌క్సెస్ అందుకోవ‌డం.. పెద్ద క‌ష్టం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో బీజేపీ – జ‌న‌సేన పేరుకు మాత్ర‌మే మిత్రులుగా ఉన్నాయి. అయితే క్షేత్ర‌స్థాయిలో ఈ రెండు పార్టీల నాయ‌కులు మాత్రం క‌ల‌సి ప‌నిచేయ‌డం లేదు. అయితే మిత్రులుగా లేక‌పోయినా టీడీపీ – జ‌న‌సేన మాత్రం చాలా విష‌యాల్లో కలిసే ప‌ని చేస్తున్నాయి.