థియేటర్లు తెరుచుకునేది ఎఫ్పుడంటే?

లాక్ డౌన్ ఐదో దశ మొదలవుతోంది. ఐతే మూడో దశ లాక్ డౌన్ నుంచి మినహాయింపులు మొదలవడం.. ఐదో దశలో మరిన్ని సడలింపులు ఇవ్వడంలో జనాలు ఇంతకుముందులా ఇబ్బంది పడటం లేదు. దాదాపుగా సాధారణ జీవనంలోకి వచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే కొన్ని షరతుల మధ్య గుళ్లు గోపురాలు, షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోబోతున్నాయి. ప్రస్తుతానికి షరతులున్నది స్కూళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు లాంటి వాటిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

పాఠశాలలు జులైలో ఆరంభం కావచ్చని అంటున్నారు. మిగతా వాటిలో పెద్ద ఇండస్ట్రీ, జనాలతో బాగా కనెక్షన్ ఉన్నది అంటే థియేటర్లే. జూన్‌లోనే థియేటర్లను పున:ప్రారంభించాలని, ప్రభుత్వ నిబంధనల్ని అనుసరిస్తూ జాగ్రత్తగా థియేటర్లు నడుపుతామని మల్టీప్లెక్సు‌ల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం అందుకు సుముఖంగా లేదు.

లాక్ డౌన్ ఐదో దశను ప్రభుత్వం లాక్ డౌన్ లాగా కాకుండా ‘అన్ లాక్’ అని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే రెండు నెలల్లో ఏమేం పున:ప్రారంభించాలనే విషయమై కొన్ని దశలు నిర్ణయించారు. ఇందులో తొలి రెండు దశల్లోనే ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్లు తదితరాలు తెరుచుకోబోతున్నాయి. ఈ రెండు దశలు పూర్తి కావడానికి జులై నెలాఖరు వరకు సమయం పడుతుంది.

థియేటర్ల సంగతి మూడో దశలోనే తేలుస్తామని పేర్కొంది. మూడో దశ విషయం నిర్దిష్టమైన తేదీలు, గడువు లాంటివేమీ పేర్కొనలేదు. ముందు రెండో దశ పూర్తి కావాలి. అప్పటికి పరిస్థితులు, పర్యవసానాలు అన్నీ చూసుకుని మూడో దశలో అన్నింటినీ ఓపెన్ చేసేస్తారన్నమాట. కాబట్టి జులై లోపు అయితే థియేటర్లు తెరుచుకోవన్నది స్పష్టం. ఆగస్టు లేదా సెప్టెంబర్లో థియేటర్లు రీఓపెన్ కావచ్చు. ఐతే ఇందుకు ఇండస్ట్రీ జనాలు ఇప్పటికే మానసికంగా సిద్ధమై ఉన్నారు. దసరా నాటికి థియేటర్లు మామూలుగా నడిస్తే చాలు అన్నది వారి ఆశ.