విమోచ‌న దినంపై.. కేసీఆర్‌కు అమిత్ షా.. స‌వాల్‌..!

Amit Shah Corona

కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీల‌క నాయ‌కుడు.. అమిత్ షా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.. మ‌జ్లిస్ పార్టీతో అంట‌కాగుతూ.. తెలంగాణ ఉద్య‌మం నాటి వాగ్దానాల‌ను కేసీఆర్ మ‌రిచిపోయార‌ని.. విమోచ‌నం దినం నిర్వ‌హిస్తామ‌ని.. చెప్పి.. ఇప్పుడు పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకొన్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మ‌ల్‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన అమిత్ షా.. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్ ఇపుడు మరిచిపోయారన్నారు. రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మజ్లిస్‌కు భయపడేది లేదని ఆయన ప్రకటించారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని, ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

అంతేకాదు.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించాల‌ని కూడా షా విజ్ఞ‌ప్తి చేశారు. ఈట‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఆయ‌నను గెలిపించ‌డం ద్వారానే న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. మ‌రి అమిత్ షా కామెంట్ల‌పై కేసీఆర్ కానీ, ఆయ‌న పార్టీ నాయ‌కులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.