సోనూసూద్ పై కేంద్రానిది కక్ష సాధింపేనా ?

కరోనా వైరస్ కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సోనూసూద్ కేంద్రంగా వివాదం మొదలైంది. మంగళ, బుధవారాల్లో సోనూసూద్ కు చెందిన ఇళ్ళు, ఆఫీసులపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు జరపటం వివాదాస్పదమవుతోంది. ఇంత హఠాత్తుగా ఐటీ అధికారులు దాడులు జరగడానికి కారణాలు ఏమున్నాయి ? ఏమున్నాయంటే సోనూ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటమే అని తెలుస్తోంది.

ఈ మధ్యనే ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సన్నిహితులుగా ఉంటున్నారు. ఈ విషయంపై బీజేపీ అగ్రనేతల కన్ను పడినట్లుంది. కేజ్రీవాల్-మోడీ మధ్య వ్యవహారం చాలా సంవత్సరాలుగా ఉప్పు నిప్పుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ ను అధికారంలో నుండి దింపేయటానికి నరేంద్రమోడి శతవిధాల ప్రయత్నిస్తున్నది. అందుకనే మోడీని కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నిజానికి కరోనా వైరస్ కష్టకాలంలో ప్రజలకు కావాల్సినవి అందించటంలో కేంద్ర ప్రభుత్వం కన్నా సోనూసూద్ ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే వ్యక్తిగా సోనూయే ప్రజలకు ఇంత సేవ చేసినప్పుడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఇంకెంత చేయాలనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం కన్నా సోనూకే జనాల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని కూడా బీజేపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే సోనూను ఏమీ చేయలేక అలా వదిలేశారు.

లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్ధతో సోనూసూద్ ఒప్పందం చేసుకున్నారట. ఆ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలున్నాయట. అందుకనే సంస్థతో పాటు సోనూసూద్ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. అయితే దాడులకు ఐటి అధికారులు చెబుతున్న కారణాలను ఎవరు నమ్మటంలేదు. ఆప్ తో సోనూ సన్నిహితంగా ఉండటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న సోనూసూద్ తొందరలోనే ఆప్ లో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. దీంతో బీజేపీ పెద్దల్లో కలవరం మొదలైందట. తొందరలోనే ఢిల్లీ ఎన్నికలున్నాయి. ఎలాగైనా కేజ్రీవాల్ ను ఓడించాలని గతంలో బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజ్రీవాల్ ఒక్కరు ఒకవైపు నరేంద్ర మోడీ అండ్ కో అంతా మరోవైపున్నా కేజ్రీవాల్ ను ఓడించలేక పోయారు. అలాంటిది రేపే సోనూసూద్ ఆప్ లో చేరితో ఇంకేమన్నా ఉందా ? వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సోనూ ఆప్ తరపున ప్రచారం చేస్తే బీజేపీకి ఇబ్బందే అందుకనే హఠాత్తుగా ఐటీ దాడులు జరిగినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.