తండ్రీకొడుకులు క‌ష్ట‌ప‌డుతున్నా.. టీడీపీలో సీనియ‌ర్ల మౌనం

రాజ‌కీయ నాయ‌కుండంటే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందేందుకు జ‌నంలో పేరు తెచ్చుకోవాలి. దాంతో పాటే పార్టీని అధికారంలోకి తేవ‌డానికి కృషి చేయాలి. అధికారంలోకి వ‌చ్చాక పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా సాగాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు మాత్రం ప్ర‌జ‌ల్లో పార్టీపై ఆద‌ర‌ణ త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. అధికారం ద‌క్క‌గానే త‌మ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకునే నాయ‌కులు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు మాత్రం పార్టీని తిరిగి గెలిపించే దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు.

మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని టీడీపీ 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటిని త‌ట్టుకోలేక చిత్తుగా ఓడిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆ పార్టీలోని చాలామంది సీనియ‌ర్ నాయ‌కులు సైలెంట్ అయ్యారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీలో ఉప ముఖ్య‌మంత్రులుగా ప‌దువులు అనుభ‌వించిన కేఈ కృష్ణ‌మూర్తి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప స‌హా మంత్రి వ‌ర్గంలో అప్పుడు ఉన్న చాలా మంది నేత‌లు ఇప్పుడు చ‌ప్పుడు చేయడం లేదు. క‌ళా వెంక‌ట్రావు పితాని స‌త్య‌నారాయ‌ణ ప్ర‌త్తిపాటి పుల్లారావు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కాల్వ శ్రీనివాసులు న‌క్కా ఆనంద్‌బాబు.. ఇలా గత ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు అనుభ‌వించిన చాలా మంది టీడీపీ నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డున్నారు? పార్టీ కోసం ఏం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

2024 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం తండ్రీకొడుకులు.. చంద్ర‌బాబు లోకేశ్ బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టినుంచే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బాబు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తూ గెలుపు స‌మీక‌ర‌ణాల‌పై ఇప్ప‌టి నుంచే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న పడుతున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక లోకేశ్ గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఆక్టివ్‌గా మారి ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీళ్లు కాకుండా బాబు మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన దేవినేని ఉమా అచ్చెన్నాయుడు య‌న‌మ‌ల మాత్ర‌మే ఇప్పుడు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తున్నారు. ఇక నారాయ‌ణ గంటా శ్రీనివాస్ మాత్రం పార్టీతో సంబంధం లేన‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. అనంత‌పురంలో జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలున్నాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా పార్టీ కోసం ఉత్సాహంగా ప‌ని చేసే నేత‌ల కోసం బాబు వెతుకుతున్న‌ట్లు తెలిసింది. యువ నాయ‌కుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చి లోకేశ్ కోసం యూత్ టీమ్‌ను సిద్ధం చేయ‌నున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. పార్టీ పున‌ర్వైభవం కోసం ప‌ని చేయ‌ని సీనియ‌ర్ నాయ‌కులు బాబు వెంట క‌లిసి రావ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బాబు చేప‌ట్టే ఆందోళ‌న‌ల్లో చిన‌బాబు చేప‌ట్టే ప‌ర్య‌ట‌న‌ల్లో వీళ్లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే టాక్‌. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించ‌డం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న బాబు వీళ్ల‌ను తిరిగి దారిలోకి తెచ్చుకుంటే మంచిద‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ సీనియ‌ర్ల‌ను పూర్తిగా ప‌క్క‌కుపెడ‌దామంటే ఆయా జిల్లాల్లో వాళ్లు బ‌లంగా ఉండ‌డంతో అది పార్టీకి న‌ష్టం చేకూర్చే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి సైలెంట్‌గా ఉన్న సీనియ‌ర్ల విష‌యంలో బాబు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.