తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్ సంస్మరణ సభను అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలని వైఎస్ షర్మిల చేసిన ప్రయత్నం విఫలమైందా ? అవుననే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. తాను తెలంగాణా అమ్మాయినే అని, తెలంగాణా కోడలినే అని షర్మిల ఎంత గొంతు చించుకున్నా చివరకు షర్మిలపై ఆంధ్రా ముద్రేపడిందంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే వైఎస్ సంస్మరణ సభకు హాజరైన వారిలో 99 శాతం మంది ఆంధ్రామూలాలున్న వారే కావటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
మొన్నటి 2వ తేదీన హైదరాబాద్ లో వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా భారీ ఎత్తున సంస్మరణ సభ నిర్వహించారు విజయమ్మ. పేరుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్నా చివరకు అంతా రాజకీయమే జరిగింది. నిజానికి వైఎస్ చనిపోయిన 12 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో అది కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న పాత కాపులను పిలవటంలోనే రాజకీయం దాగుంది. ఇంత మంది రాజకీయ నేతలను పిలిచి ఏర్పాటు చేసిన సభ రాజకీయ సభ కాకుండా ఏమవుతుంది ? చివరకు జరిగింది అదే కదా.
సంస్మరణ సభ నిర్వహణలో విజయమ్మ హిడెన్ అజెండా ఏమిటంటే కూతురుకు రాజకీయంగా మద్దతు సంపాదించటమే. కానీ ఆపనైతే జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ఆహ్వానించారని నేతలంతా పరుగెత్తుకుని అక్కడ వాలిపోలేదు. ప్రజెంట్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ కూన శ్రీశైలం గౌడ్ మాత్రమే కనిపించారు. మిగిలిన వాళ్ళంతా మాజీలు, అవుట్ డేటెడ్ నేతలే. వీళ్ళు కాకుండా హాజరైన వారంతా మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ లు. వాళ్ల వల్ల షర్మిలకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఇక కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ వల్ల కూడా షర్మిలకు ఏమాత్రం ఉపయోగం లేదని అందరికీ తెలిసిందే. హాజరైన వాళ్ళను చూసిన తర్వాతే సంస్మరణ సభపై ఆంధ్రా ముడ్రపడిందంటున్నారు. అంటే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని శపథం చేసిన షర్మిల సభకు హాజరైన వారిలో అత్యధికులు ఆంధ్రా వాళ్ళే అన్న విషయం బాగా ప్రచారమైంది. ఆంధ్ర మూలాలున్న వాళ్ళు, ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఎంతమంది షర్మిలకు మద్దతుగా నిలబడితే మాత్రం ఏమిటి ఉపయోగం ?
తెలంగాణా పార్టీల్లో ఇపుడు యాక్టివ్ గా ఉన్న నేతల్లో కొంతమందైనా హాజరై షర్మిలకు మద్దతుగా నిలబడుంటే అప్పుడు కథ వేరుగా ఉండేది. పైగా సభకు హాజరైన వారు కూడా షర్మిలకు మద్దతుగా నిలబడతామని చెప్పలేదు. హాజరైన వారందరు వైఎస్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారంతే. మొత్తానికి సంస్మరణ సభ రూపంలో ఏదో చేద్దామని విజయమ్మ, షర్మిల అనుకుంటే ఇంకేదో అయ్యిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చూద్దాం చివరకు ఏమవుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates