మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ మంత్రి సురేష్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి పై ఎఫ్ఐఆర్ నమోదు కు రెడీ అయ్యింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదవుతున్న ఘటన చాలా ఆసక్తిగా మారింది. గడచిన రెండున్నరేళ్లలో ఓ మంత్రిపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదవ్వటం ఇదే మొదలు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే సురేష్+విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యంతో సురేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. భార్య మాత్రం ఇప్పటికీ ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నారు. ఇద్దరు ఉద్యోగంలో ఉండగా అంటే 2016 సమయంలో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారులపై సీబీఐ దాడులు చేసింది. ఇందులో భాగంగానే విజయలక్ష్మి ఇంటి పైన కూడా దాడులు జరిపింది.

ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే విజయలక్ష్మి ఇంటిపై దాడి చేసిన సీబీఐ దంపతులిద్దరి పైన కేసు నమోదు చేసింది. పైగా విజయలక్ష్మి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తలున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అసలు విజయలక్ష్మిని ప్రాధమికంగా కూడా విచారించకుండానే సింపుల్ గా దాడులు చేసి సోదాలు జరిపి దంపతులిద్దరిపైనా కేసులు పెట్టేసిందని వారి ఆరోపణ. ఈ విషయంపైనే దంపతులిద్దరు హైకోర్టులో చాలెంజ్ చేశారు. తమను ప్రాధమికంగా కూడా విచారణ చేయలేదని, అక్రమాస్తులున్నట్లు ఎఫ్ఐఆర్ లో కూడా చెప్పలేదన్నారు.

విజయలక్ష్మి టార్గెట్ గా దాడులు చేసిన సీబీఐ తన పైన కూడా కేసు నమోదు చేయడం ఏమిటని సురేష్ తన పిటిషన్లో వాదించారు. విచారణలో దంపతులు వాదనను సీబీఐ సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోయింది. దాంతో కేసును కొట్టేసింది హైకోర్టు. అయితే ఇదే విషయాన్ని సీబీఐ సుప్రింకోర్టులో చాలెంజ్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేకపోయింది.

అయితే తమ దాడుల్లో విజయలక్ష్మి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు బయటపడిందని సీబీఐ లాయర్ చెప్పారు. మరదే విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తన వాదన చెప్పుకునేందుకు విజయలక్ష్మిని ఎందుకు ప్రశ్నించలేదన్న ప్రశ్నకు కూడా సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. దీంతో విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది.