వైజాగ్ ను ఏపీ రాజధానిగా డిసైడ్ అయిన మోడీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అన్న ప్రశ్నను అడిగితే..అమరావతి అన్న మాట వినిపిస్తుంది. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో రాజధానిగా ప్రస్తుతానికి అమరావతిగానే భావిస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే.. ఘనత వహించిన మోడీ సర్కారు మాత్రం వైజాగ్ ను పాలనా రాజధానిగా గుర్తించేసినట్లుగా తాజాగా బయటకు వచ్చిన ఒక డాక్యుమెంట్ స్పష్టం చేయటం సంచలనంగా మారింది.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా పేర్కొంటూ.. దాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరు కావటం.. ఒక బిందె నిండా నీళ్లను (పవిత్రజలాలు).. మరో బిందె నిండా మట్టిని (అన్ని రాష్ట్రాల పవిత్ర మట్టిని) ఇచ్చి.. అద్భుతమైన రాజధానిగా.. ఆ మాటకు వస్తే ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ విషయంలో మరో మాటకు తావు లేదన్నట్లుగా బిల్డప్ ఇవ్వటం తెలిసిందే.

అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయం తీసుకున్న బాబు సర్కారుకు భిన్నంగా.. జగన్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఏపీకి ఒకటి కాదు.. అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం లభించేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రావటం.. పాలనా రాజధానిగా విశాఖ.. అసెంబ్లీ సమావేశాలకు అమరావతి.. జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూలును నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే..దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమరావతి వాసులతో పాటు పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన నిర్ణయం పెండింగ్ లో ఉంది. అలాంటప్పుడు.. కేంద్రం కానీ మరొకరు కానీ విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించే అవకాశం లేదు.

తాజాగా.. వివిధ రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పెట్రోల్ సుంకాలపై లోక్ సభలో అడిగిన ప్రశ్నకు తాజాగా కేంద్రం సమాధానం ఇచ్చింది. వాస్తవానికి ఈ పత్రం ఇచ్చి కొద్ది రోజులు అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా చూసినప్పుడు ఏపీ రాజధానిగా విశాఖ పట్టణాన్ని చూపించటం షాకింగ్ గా మారింది. ఆలస్యంగా బయటకు వచ్చిన తాజా పత్రం కలకలం రేపుతోంది. వాస్తవానికి జులై 26న సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాల వారీగా పన్నులు.. సుంకాల వ్యత్యాసాన్నిసదరు పత్రంలో వివరంగా కేంద్రం తెలియజేసింది. అయితే.. అందులోని అంకెల మీదనే అందరి ఫోకస్ ఉంది తప్పించి.. రాజధాని నగరంగా దేన్ని పేర్కొన్నారన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారు. ఏపీ రాజధానిగా విశాఖను కేంద్రం చూపించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. దీనిపై వెల్లువెత్తుతున్న విమర్శలకు కేంద్రం ఏమని బదులిస్తుందో చూడాలి.