పిజ్జా డెలివరీ చేస్తున్న ఆప్ఘాన్ మాజీ మంత్రి..!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామేత చాలా సార్లు మీరు వినే ఉంటారు. అయితే.. ఇది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి విషయం నిజమైంది. ఒకప్పుడు దేశానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు పరిస్థితులు బాగోక.. పిజ్జా డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఈ సంఘటన ఆప్ఘనిస్తాన్ లో చోటుచసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈయ‌న పేరు స‌య్య‌ద్ అహ్మ‌ద్ సాద‌త్. ఏడాది క్రితం వ‌ర‌కూ ఆఫ్ఘనిస్థాన్‌లో ఐటీ, కమ్యూనికేషన్ల‌ మంత్రిగా పనిచేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు జ‌ర్మ‌నీలో . సైకిల్‌పై తిరుగుతూ పిజ్జా డెలివ‌రీలు చేస్తున్నాడు. ఘ‌నీ ఆప్ఘ‌నిస్థాన్‌ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనే 2018 నుంచి 2020 వరకు మంత్రిగా పనిచేశారు స‌య్య‌ద్. కానీ ఆ త‌ర్వాత ఆయ‌న‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ‌టంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

గ‌తేడాది డిసెంబర్‌లో ఆఫ్ఘాన్ వ‌దిలి వెళ్లి జ‌ర్మ‌నీలో స్థిర‌ప‌డ్డారు. అయితే మంత్రిగా ప‌ని చేసి ఉండ‌టంతో.. తొలినాళ్ల‌లో ఏప‌ని చేయ‌కుండా చేతిలో ఉన్న డ‌బ్బంతా ఖ‌ర్చుపెట్టారు. ఆ త‌ర్వాత చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో ఇలా జర్మనీలోని లీప్ జిగ్ న‌గ‌రంలో డెలివరీ బాయ్‌గా మారాడు. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ అల్‌ జజీరా ఈయ‌న ఫోటోల‌ను ట్వీట్ చేసింది.

వాస్త‌వానికి స‌య్య‌ద్ పిజ్జా డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆయ‌న ఉన్న‌త విద్యావంతుడు. ఆక్స్ ఫర్డ్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో ఏకంగా రెండు డిగ్రీలు చేశారు. ఆ త‌ర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు సైతం చేశారు. తొలుత ఆఫ్ఘనిస్థాన్‌ కమ్యూనికేషన్‌, టెక్నాలజీ మంత్రికి సలహాదారుగా.. ఆ త‌ర్వాత కొన్నాళ్లు లండన్‌లో ఏరియానా టెలికాం కంపెనీకి సీఈఓగా కూడా పనిచేశారు. ఆత‌ర్వాత ఆప్ఘ‌నిస్థాన్‌లో మంత్రి అయ్యారు. మరి ఇప్పుడు పిజ్జా డెలివరీ ఉద్యోగమే ఎందుకు చేస్తున్నారో తెలీదు కానీ.. ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి.