వైసీపీ నేత‌పై వైసీపీ ఫ్యాన్స్ బూతులు

అద్దేప‌ల్లి శ్రీధ‌ర్‌.. ఒక‌ప్పుడు జ‌న‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధిగా బాగానే పాపులారిటీ సంపాదించిన నేత‌. టీవీ చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన గ‌ళం బాగానే వినిపించాడాయ‌న‌. ఐతే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోర ప‌రాభ‌వం చ‌విచూడ‌టంతో ఆయ‌న రూటు మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్ప‌ట్నుంచి ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున గ‌ళం వినిపిస్తున్నారు. జ‌న‌సేన‌, టీడీపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఐతే వైసీపీలో ఆయ‌న‌కు త‌గినంత ప్రాధాన్యం అయితే క‌నిపించ‌ట్లేదు. అక్క‌డ‌ సొంత గుర్తింపంటూ ఏమీ లేక‌పోయింది. వైసీపీ పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కు అంతంత‌మాత్రంగానే ఉంటోంది.
ప‌వ‌న్‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేశాడంటూ జ‌న‌సైనికులు ఆయ‌న‌పై త‌ర‌చుగా దాడి చేస్తుంటారు. కౌంట‌ర్ చేస్తుంటారు. వారి దాడిని కాచుకోవ‌డానికే ఆయ‌న ఆప‌సోపాలు ప‌డిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఒక కామెంట్‌తో అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ వైసీపీ అభిమానులు ఆయ‌న‌కు యాంటీ అయిపోయారు.

వ‌రుస‌గా జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా తీర్పులిస్తున్న హైకోర్టుపై.. వైకాపా నాయ‌కుల‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ అ‌భిమానులు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం, వారికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయ‌డం తెలిసిన సంగ‌తే. దీనిపై జ‌రిగిన ఓ టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో పాల్గొన్న అద్దేప‌ల్లి శ్రీధ‌ర్.. ఈ వ్య‌వ‌హారం తీవ్ర‌త త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. ఇలా నోటీసులు అందుకున్న 49 మందిలో 98 శాతం మంది ఇల్లిట‌రేట్స్ అని.. వాళ్ల‌కు మీడియా ముందు,

సోష‌ల్ మీడియాలో ఎలా మాట్లాడాలి.. ఏం రాయాలి అన్న‌ది తెలియ‌ద‌ని.. వ్యాఖ్యానించారు. ఐతే కోర్టు వ్య‌వ‌హారాలు తెలియ‌క త‌ప్పు చేశారంటూ వైకాపా అభిమానుల్ని వెన‌కేసుకునే ప్ర‌య‌త్నమే చేశారు కానీ… ఇల్లిట‌రేట్స్ అనే ప‌దం వాడ‌టంతో నోటీసులందుకున్న వారికి మండిపోయింది. త‌మ‌ను ఇల్లిట‌రేట్స్ అంటారా ఆయ‌న‌పై ఎదురుదాడి చేస్తూ బూతులు తిడుతున్నారు. ఈ విష‌యంలో వైకాపా వాళ్ల‌తోనే అద్దేప‌ల్లి ట్విట్ట‌ర్లో యుద్ధం చేయాల్సి వ‌స్తోంది. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ నుంచి ఇలాంటి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అద్దేప‌ల్లి ఊహించి ఉండ‌డు.