పాద‌యాత్ర‌ల‌తో ఫ‌లితం ద‌క్కేనా?

Bandi Sanjay
Bandi Sanjay

ఇప్పుడు తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్‌కు తెర‌లేచింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే జ‌న ఆశీర్వాద్ యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రాష్ట్రంలో తిరిగేస్తున్నారు. రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ చేప‌డుతోన్న సంక్షేమ ప‌థ‌కాలు అభివృద్ధి ప‌నులను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకే అధిష్ఠానం ఆదేశాల‌తో కిష‌న్‌ రెడ్డి ఈ యాత్ర చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే మాట్లాడిన చోట‌ల్లా రాష్ట్రంలోని అధికార ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో పాటు మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను సంక్షేమాన్ని బ‌లంగా చాటిచెప్తున్నారు. మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించాల‌నే ప్ర‌చారాన్ని ప‌నిలోప‌నిగా పూర్తి చేస్తున్నారు.

మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో ఈ నెల 24 నుంచి పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచి మొద‌లు కానున్న ఈ పాద‌యాత్ర రాష్ట్రవ్యాస్తంగా సాగ‌నుంది. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌డంతో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు తేవ‌డమే ల‌క్ష్యంగా ఈ పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు బండి సంజ‌య్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్నారు. మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర మొద‌లెట్టారు. కానీ మ‌ధ్య‌లో మోకాలికి శ‌స్త్రచికిత్స కార‌ణంగా ఇప్పుడు విరామం తీసుకున్నారు.

అయితే ఈ పాద‌యాత్ర‌లు రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లిగిస్తాయి? ఆ పార్టీ కోరుకున్న ఫ‌లితం ద‌క్కేనా? అనే చ‌ర్చ ఇప్పుడు జ‌నాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే అటు కేంద్రంలోని మోడీ అధికారంలో ఉన్న ప్ర‌భుత్వంపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచ‌డం ఆరంభ‌మైంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌లం, పెట్రోల్‌, డిజీల్ ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోవ‌డం వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యం మొండి వైఖ‌రి ఇలా వివిధ కార‌ణాల‌తో మోడీ ప్ర‌భ క్ర‌మంగా త‌గ్గుతుంద‌నే అభిప్రాయాలూ వినప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌న ఆశీర్వాద్ యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కేంద్ర మంత్రుల‌ను బీజేజీ అధిష్ఠానం ఆదేశించింది. అయితే ఈ పాద‌యాత్ర‌ల పేరుతో కేంద్ర మంత్రులు చెప్పే విష‌యాల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో జ‌నం లేర‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే క‌రోనాతో చితికిపోయిన సామాన్య ప్ర‌జ‌ల‌ను ఇప్పుడు పెరిగిన ధ‌ర‌ల భారం మ‌రింత‌గా కుంగ‌దీస్తోంది. వీటికి ప్ర‌ధాని మోడీ అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా అదే అభిప్రాయానికి వ‌స్తున్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న‌పై కూడా ప్ర‌జ‌ల్లో కాస్త వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీన్ని త‌గ్గించుకునేందుకు వివిధ ప‌థ‌కాల‌తో సీఏం కేసీఆర్ ప్ర‌జ‌లు పార్టీపై వ్య‌తిరేక‌త పెంచుకోకుండా కాపాడుకునేందుకు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో బండి సంజ‌య్ పాద‌యాత్ర బీజేపీకి బ‌లాన్ని పెంచే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ అది పూర్తిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పుల‌కు మాత్రం దారి తీసే అవ‌కాశం లేద‌ని చెప్తున్నారు. ఏదైమైనా కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న సంజ‌య్ ఎలాంటి ఫ‌లితాన్నిరాబ‌డ‌తారో అనే ఆస‌క్తి మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొంది.