పెగాసస్ పై కేంద్రం దొరికిపోయిందా ?

‘పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా ? లేదా’ ? అన్న ప్రశ్నతో నరేంద్రమోడి సర్కార్ దొరికిపోయింది. పెగాసస్ స్పైవేర్ ఉపయోగించటం ద్వారా ప్రతిపక్ష నేతలు, దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో ఎంత గందరగోళం రేగిందో అందరు చూసిందే. ప్రతిపక్షాలు, ప్రముఖులు ఎంత గోల చేసినా కేంద్రం పెద్దగా స్పందించలేదు.

తమ ఆరోపణలపై స్వయంగా నరేంద్రమోడినే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేతలు ఎంతగా డిమాండ్ చేసినా ప్రధాని ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో లాభంలేదని కొందరు ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, జర్నలిస్టులు సుప్రింకోర్టులో పిటీషన్లు వేశారు. ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పకపోయినా సుప్రింకోర్టు విచారణలో అయినా సమాధానం చెప్పాల్సిందే. ఇపుడిదే అంశం దేశంలో ఉత్కంఠ రేపుతోంది. దీనికి కారణం ఏమిటంటే విచారణలో కేంద్రం తన వాదనను సరిగా వినిపించలేదు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించిందా లేదా అన్న విషయం తేల్చకుండా రెండు పేజీల అఫిడవిట్లో ఆవువ్యాసం లాగ బుర్రకు ఏదితోస్తే అది చెప్పేసింది. మరింత వివరంగా కావాలంటే మరో అఫిడవిట్ దాఖలు చేస్తానని కేంద్రం సుప్రింకోర్టు విచారణలో చెప్పటమే విచిత్రంగా ఉంది. దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా ఒకచోట పెగాసస్ స్పైవేర్ లాంటిది ఏమీ లేదని చెప్పింది. అలాగే మరోచోట ఇది దేశరక్షణకు సంబంధించిన విషయం కాబట్టి బహిరంగ చర్చ సాధ్యంకాదని చెప్పింది.

కేంద్రం సమాధానంతో విస్తుపోయిన సుప్రింకోర్టు డైరెక్టుగా పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా లేదా ? అన్న విషయాన్ని సూటిగా చెప్పండి అంటు నిలదీసింది. సుప్రింకోర్టు డైరెక్టుగా వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పని కేంద్రం తమకు కొంత సమయం కావాలని కోరటం ఆశ్చర్యం. నిపుణుల కమిటి వేస్తామని కేంద్రం చెప్పినపుడు సుప్రింకోర్టు అంగీకరించలేదు. సుప్రింకోర్టు విచారణ సందర్భంగా కేంద్రం దాటవేత వైఖరితోనే పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిందనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాకపోతే అధికారికంగా అంగీకరించాల్సింది మాత్రమే మిగిలుంది.

నిజానికి స్పైవేర్ ఉపయోగించటమన్నది నరేంద్రమోడి ప్రభుత్వంతోనే మొదలుకాలేదు. గతంలో కూడా ప్రతి ప్రభుత్వం ఏదోరూపంలో ఏదో ఓ పద్దతిలో నిఘాను ఉంచుతుందన్న విషయం తెలిసిందే. దేశభద్రత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం 24 గంటలూ అనుమానితులపై నిఘాను ఉంచుతుందన్న విషయం తెలిసిందే. కాకపోతే ప్రతిపక్షనేతలు, దేశంలోని ప్రముఖుల్లో వేలమంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయటం మాత్రం ఇదే మొదటిసారి. ఇపుడిదే కేంద్రానికి తలనొప్పులుగా మారింది. మరి ఇందులో నుండి మోడి ఎలా బయటపడతారో చూడాలి.