ఆఫ్ఘన్లో మొదలైన అరాచకాలు

గడచిన వారం రోజులుగా ఆఫ్ఘనిస్ధాన్ దేశంలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు మూడో వారంలో యావత్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళిపోతుందని అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా 15వ తేదీకే దేశంలో నాయకత్వం మారిపోయింది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవికి రాజీనామా చేసి అధికారాన్ని తాలిబన్లకు అప్పగించేసి దేశంవదిలి పారిపోయారు. ఈయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, ముఖ్యనేతలు కూడా దేశంనుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

అందరికీ పైకి కనబడుతున్న పరిస్దితులివి. కానీ కనబడని దారుణాలు చాలాఉన్నాయి. అవేమిటంటే ఆడవాళ్ళు రోడ్లపైకి రావటంలేదు. వస్తే కిడ్నాప్ చేయటమో లేకపోతే కాల్చి చంపేయటమే చేస్తున్నారు తీవ్రవాదులు. అందుకనే 24 గంటలూ ఆడవాళ్ళు ఇళ్ళల్లోనే మగ్గిపోతున్నారు. ఇక వివాహాలు చేసుకోవటం కోసం తాలిబన్లు ఇళ్ళల్లోకి జొరబడి నచ్చిన వివాహాలు కాని ఆడవాళ్ళను, అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు. స్కూళ్ళు, కాలేజీలను మూసేశారు.

ఇక నున్నగా షేవ్ చేసుకుంటున్న మగవాళ్ళాని కొరడాలతో కొడుతున్నారు లేదా కాల్చేస్తున్నారు. తప్పనిసరిగా మగవాళ్ళందరు బారు గడ్డాలు పెంచుకోవాల్సిందే. జీన్సు ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుంటే వాళ్ళ పనైపోయినట్లే. అందుకనే తాలిబన్ల జెండాలు పాతిన ప్రాంతాల్లో యువకులు అర్జంటుగా జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులను మడిచి పెట్టేల్లో పెట్టేసుకున్నారు. ఇదే సమయంలో ఇష్టంలేకపోయినా పఠాను డ్రస్సులను వేసుకుంటున్నారు. యువకులు రోడ్లమీద తిరగాలంటే తాలిబన్ జెండాను భుజాన మోయటం తప్ప వేరేదారిలేదు.

ఇక డబ్బుల కోసం జనాలందరు బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు. ఇష్టంలేని వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోవచ్చని తాలిబన్లిచ్చిన బంపర్ ఆఫర్ ను జనాలు ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 5 వేలమంది దేశం విడిచిపెట్టి పారిపోతున్నారు. విదేశాలకు పారిపోవాలంటే విమానాలు తప్ప దిక్కులేదు కాబట్టి బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా తీసుకుని టికెట్లు కొనుకొని విమానాల్లో వెయిట్ చేస్తున్నారు. చేతిలో డబ్బుంటే చాలు ఆస్తులను కూడా వదిలేసి కుటుంబసభ్యులతో ఇప్పటికే సుమారు 50 వేలమంది దేశం విడిచిపారిపోయినట్లు అంచనా. సిటీ బస్సుల్లో ఎక్కటానికి ఎలా తోసుకుంటారో విమానాల్లోకి కూడా అలాగే తోపులాటలతో ఎక్కేస్తున్నారు.

గడచిన 20 ఏళ్ళుగా ఎంతో స్వేచ్చను అనుభవించిన ఆఫ్ఘన్ జనాలు ప్రధానంగా ఈ తరం యువత నిర్భందాలను తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా సరే తమను తమదేశం నుండి బయటకు తీసుకెళ్ళిపోమని ఇతర దేశాల్లోఉన్న తమ బంధువులను బతిమలాడుకుంటున్నారట. పాకిస్ధాన్-ఆప్ఘన్ మధ్య ఉన్న సరిహద్దుల్లో నుండి రోజూ అనధికారికంగా వేలాదిమంది ముందు పాకిస్ధాన్ తర్వాత భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి దుర్భర పరిస్దితుల్లో బతకాల్సొస్తుందని ఎవరం అనుకోలేదని ఆప్ఘన్ యువత నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని అకృత్యాలను చూడాల్సొస్తుందో ఏమో.