కాంగ్రెస్ ట్విట్ట‌ర్ ఖాతాల ర‌ద్దు.. తెర‌వెనుక మోడీ.. నిజ‌మేనా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 5 వేల మంది ట్విట్ట‌ర్ ఖాతాల‌ను ఆ సంస్థ ర‌ద్దు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తమ పార్టీ అధికారిక ఖాతా సహా.. 5 వేల మంది నేతల ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ట్విట్టర్ ఈ మేరకు వ్యవహరించిందని ఆరోపించింది. నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ పార్టీ నేతలకు చెందిన 5వేల ఖాతాలను ట్విట్టర్ రద్దు చేసిందని కాంగ్రెస్ తెలిపింది.

5 వేల ఖాతాల బ్రేక్‌

కాంగ్రెస్ అధికారిక ఖాతా, రణదీప్ సూర్జేవాలా ఖాతా సహా ఐదు వేల మంది కీలక నేతల అకౌంట్లను ట్విట్టర్ లాక్ చేసిందని ఏఐసీసీ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా వెల్లడించారు. దీనిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్ పనిచేస్తోంద‌న్న ఆయ‌న‌. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు చెందిన 5వేల ఖాతాలను నిలిపివేసింద‌ని అన్నారు. అయితే ట్విట్టర్, కేంద్రం ఒత్తిడికి కాంగ్రెస్ తలొగ్గ‌బోద‌ని అన్నారు. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను లాక్‌ చేసిన కొన్ని రోజులకే ఇలా జరగడం గమనార్హం.

ముదురుతున్న వివాదం

దేశం కోసం తాము చేసే పోరాటాన్ని ఇలాంటి చర్యల ద్వారా ఆపవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తు న్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిరసన తెలపడాన్ని, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడాన్ని తప్పుగా చూస్తున్నారని మండిపడింది. ట్విట్టర్‌ ఖాతాలను బ్లాక్‌ చేసే కాంగ్రెస్‌ నేతల జాబితా మరింత పెరగవచ్చ ని తెలిపింది.

ఇవే రీజ‌న్లా?

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటు కాంగ్రెస్ అధికారిక అకౌంట్ను బ్లాక్ చేయడానికి గల కారణాన్ని ట్విట్టర్ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫొటోను పోస్ట్ చేసినందుకు ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఇలా చేసినట్లు వివరించింది. సంస్థ రూల్స్ను పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘మా నియమాలను ఉల్లంఘించేలా ఓ చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు వేల ట్వీట్లపై చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాగే చర్యలు చేపడతాం’ అని ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు.

గ‌తంలో రాహుల్‌కు ప‌రాభ‌వం..

ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లను తొలగించకపోతే.. సంబంధిత ఖాతాను సంస్థ తాత్కాలికంగా నిలిపివేస్తుంది. వివాదాస్పద ట్వీట్ను డిలీట్ చేసే వరకు లేదా.. ఆ వివాదం పరిష్కారమయ్యే వర కు సస్పెన్షన్ను కొనసాగిస్తుంది. ఢిల్లీ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను ఇటీవల కలిసిన రాహుల్ గాంధీ.. ఓ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మైనర్ బాధితురాలి కుటుంబం వివరాలు తెలిసేలా ఫొటో ఉందని జాతీయ బాలల హక్కుల కమిషన్ ట్విట్టర్కు ఫిర్యాదు చేసింది. దీనిపైనే ట్విట్టర్ చర్యలు తీసుకుంది.