టీడీపీని ఓడించింది బీజేపీనేట !

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రకటనలను జనాలు నమ్ముతారా ? లేదా నవ్వుకుంటారా ? అనే వెరుపు కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మీడియాతో వీర్రాజు మాట్లాడుతు వైసీపీకి గట్టి వార్నింగే ఇచ్చారు. తమతో పెట్టుకుంటే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని చాలా ఘాటుగా వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.

ఇంతకీ బీజేపీతో పెట్టుకున్నందు వల్ల టీడీపీకి ఎలాంటి గతిపట్టింది ? అంటే ఘోరంగా ఓడిపోయిందట. తమతో పెట్టుకున్నందువల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటుకు సీట్టకు పడిపోయిందని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇక్కడే వీర్రాజు చేసిన ప్రకటన విషయంలో జనాలు ముందు హాస్చర్యపోయి తర్వాత నవ్వుకుంటున్నారు. జనాలందరు జగన్మోహన్ రెడ్డి దెబ్బకే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కుదేలైపోయిందని అనుకుంటున్నారు.

ఇందుకు కారణం ఏమిటంటే టీడీపీ ఓడిపోయిన అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల్లో వైసీపీనే గెలిచింది కాబట్టి. మరి మధ్యలో బీజేపీ దెబ్బకు టీడీపీ కుదేలవ్వటం ఏమిటి ? నిజంగానే వీర్రాజు చెప్పింది నిజమైతే మరి బీజేపీ ఒక్క అసెంబ్లీ, ఎంపి సీటులో కూడా ఎందుకని గెలవలేదు ? టీడీపీని దెబ్బకొట్టేంత సీనే బీజేపీకి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే తాను పోటీచేసిన ఏ సీటులో కూడా కమలంపార్టీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు.

వాస్తవాలు ఇలాగుంటే అందరికీ తెలిసిన లాజిక్ కూడా మరచిపోయి వీర్రాజు ప్రకటనలు చేసేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అప్పటి సాధారణ ఎన్నికలే కాదు ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. అసలు పోటీ చేయటానికి అభ్యర్ధులే దొరకటం లేదు కమలంపార్టీకి. వాస్తవం ఇలాగుంటే వీర్రాజు మాత్రం మీడియాను చూడగానే పూనకం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు.