మోడిపై పెరిగిపోతున్న అనుమానాలు

పెగాసస్ స్పైవేర్ వినియోగంపై ఇన్నిరోజులకు రక్షణమంత్రిత్వ శాఖ నోరిప్పింది. పార్లమెంటులో సోమవారం సీపీఎం ఎంపి ప్రశ్నకు సమాధానమిస్తు పెగాసస్ తో రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ ప్రకటించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ విషయమై పార్లమెంటులో ఎంత గందరగోళం నడుస్తోందో అందరికీ తెలిసిందే.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు దేశంలోని కొన్ని వేల మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిదనేది కేంద్రప్రభుత్వంపై ఉన్న ఆరోపణలు. తమ ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్లు చేస్తున్నా మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. ప్రతిపక్షాల ఆరోపణలంతా ఉత్తవే అని ఓ మంత్రితో ప్రకటన చేయించిన ప్రధానమంత్రి అదే సమాధానాన్ని తానే ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావటంలేదు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన జూలై 19వ తేదీన మొదలైన పెగాసస్ గొడవ ఈరోజుకు కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే రక్షణశాఖ సహాయమంత్రి స్పందించారు. పెగాసస్ తో తమ శాఖ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ప్రకటించారు. మరి ఇదే సమాధానం చెప్పటానికి రక్షణశాఖ ఎందుకు ఇన్నిరోజులు తీసుకుందో అర్ధం కావటంలేదు.

పెగాసస్ తో ఒప్పందం చేసుకున్నట్లు చెబితే గొడవలు మరింతగా పెరిగిపోతాయని కేంద్రం అనుకున్నా అర్ధముంది. ఒప్పందం లేదని చెప్పటానికి కూడా ఇన్ని రోజులు తీసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇది రక్షణశాఖ ఒక్క విషయమే కాదు. పెగాసస్ తో కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అందుకనే తమ ఆరోపణలపై హోలు మొత్తంమీద మోడియే సమాధానం చెప్పాలని గట్టిగా నిలదీస్తున్నారు. దీనికితోడు విదేశీమీడియా కూడా పెగాసస్ ద్వారా భారత్ లో వేలాది మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే వార్తలు, కథనాలను వరుసగా అందిస్తున్నాయి. మొత్తంమీద ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పటానికి మోడి వెనకాడేకొద్దీ అందరికీ కేంద్రప్రభుత్వంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.