‘పెగాసస్’ విచారణలో ఆ లాయర్ కు అక్షింతలు వేసిన సుప్రీం

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కొత్త తలనొప్పులకు కారణమైన పెగాసస్ ఉదంతంపై తాజాగా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయల్ కు చెందిన ఎన్ఎస్వోకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో పలు రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెడుతున్నట్లుగా ఆరోపణలు రావటం.. సంచలన కథనాలతో పాటు.. ప్రముఖుల పేర్లు బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంటు ఉభయసభలు కూడా సజావుగా జరగని పరిస్థితి నెలకొంది.

పెగాసస్ నిఘా ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అభ్యర్థిస్తూ మొత్తం తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై భారీ ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించింది. పిటిషనర్లలో కొందరు తమ ఫోన్లపై నిఘా పెట్టారంటున్నారని.. మరి వారు ఐటీ చట్టం.. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం పోలీసులకు ఎందుకు ఫిర్యాదులు చేయలేదు? 2019లోనే పెగాసస్ ఉదంతం బయటపడితే.. ఇప్పటివరకు ఎందుకు కోర్టుకు రాలేదన్న కీలక కామెంట్ చేసింది. అయితే.. పెగాసస్ 2019లోనే బయటకు వచ్చినా.. ఇప్పుడిప్పుడే కొన్ని నివేదికలు రావటం.. ఆ విడుదలైన జాబితాలో తమ పేర్లు ఉండటంతో కోర్టును ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పిటిషనర్ల పిటిషన్లపై అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీనికి కారణం పిటిసనర్లలో విద్యావంతులు.. ప్రముఖులు.. మేధావి వర్గానికి చెందిన వారు ఉన్నారని.. అలాంటి వేళలో తమకు అందుబాటులోని ఉన్న వనరులతో పాటు వివరాల్ని సేకరించి.. మరింత నిర్ధారించుకోదగ్గ సమాచారాన్ని సేకరించి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యను చేశాయి. పలు పిటిషన్లను పరిశీలించే క్రమంలో జరిగిన వాదనలు ఇలా ఉంటే.. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేసింది.

‘మిస్టర్ శర్మా.. ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ తప్పించి.. మీ పిటిసన్ లో ఏముంది? దేనికోసం ఈ పిటిసన్ దాఖలు చేశారు? అని ప్రశ్నించింది. మేమే సమాచారాన్ని సేకరించి మీ తరఫున వాదించాలా? ఇది పద్దతి కాదు’ అంటూ సీరియస్ అయ్యింది. అంతేకాదు.. ఆయన పిటిషన్ లో ప్రతివాదులుగా ప్రధాని నరేంద్రమోడీ.. కేంద్రమంత్రి పెగాసస్ పేర్లను వ్యక్తిగతంగా చేర్చటాన్ని తప్పు పట్టింది. వ్యక్తులను చేరిస్తే నోటీసులు ఎలా ఇస్తాం? అని ప్రశ్నించింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పిటిషన్లు దాఖలు చేసినా.. అందులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం చెప్పేసిందని చెప్పాలి.