తీన్మార్ మల్లన్న అరెస్టు? ఆమె ఇచ్చిన కంప్లైంట్ తోనేనా?

ఘాటైన విమర్శలతో తెలంగాణ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై స్పష్టత రాలేదు. క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ చానల్ వ్యవస్థాపకుడిగా.. ప్రతి నిత్యం యూట్యూబ్ లైవ్ లో దినపత్రికలను విశ్లేషించటం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షంపై ఆయన తరచూ తీవ్ర వ్యాఖ్యలు.. విమర్శలు.. ఆరోపణలు చేస్తుంటారు.

ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి.. అనూహ్య రీతిలో ఓట్లను సొంతం చేసుకున్న ఆయన తరచూ సంచలనాలకు కారణమవుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల్ని పెద్ద ఎత్తున వినియోగించటం ఆసక్తికరంగా మారింది. తొలుత తనిఖీల పేరుతో క్యూ న్యూస్ చానల్ కార్యాలయానికి వచ్చిన పలు విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులు.. టాస్క్ ఫోర్సు టీం.. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు కలిసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన పలు హార్డ్ డిస్కుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ ఇలాంటి పరిస్థితి కారణం ఏమిటి? ఎవరు చేసిన ఫిర్యాదుతో ఇవన్నీ చేస్తున్నారన్న విషయానికి వస్తే.. క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్.. తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు.. మూడు రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్లన్న అక్రమాలు చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి పలు ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

దీనికి కౌంటర్ గా మల్లన్న ఆదివారం ఉదయం న్యూస్ లో కొన్నిప్రత్యారోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ తో కలిసి ఉన్న కొందరు యువతుల ఫోటోల్ని.. వీడియోల్ని ప్రదర్శించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రియాంక అనే మహిళ ఫోటో కూడా ఉంది. తనపై చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఆమె.. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. స్నేహపూర్వకంగా దిగిన ఫోటోల్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా తను తీవ్ర మనోవ్యధకు గురైనట్లుగా పేర్కొన్నారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. చిలుకా నగర్ పోలీస్ స్టేషన్ లోనూ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు ఉంది. మొత్తంగాతీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మల్లన్న ఆఫీసు వద్దకు చేరుకున్నారని తెలిసిన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా మల్లన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదనంతర చర్యలు ఏం తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.