అఖిలకు మేనమామ అండ… ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాజకీయం డోలాయమానంలో పడింది. భూమా కుటుంబంలో కూడా పెద్దగా సఖ్యత లేదు. దాంతో భూమా ఫ్యామిలీకు అడ్డాలుగా నిలిచిన ఆళ్ళగడ్డ, నంద్యాలలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి టీడీపీలో పోటీ చేసేందుకు వేరే నాయకులు కూడా రెడీగా ఉన్నారు. చంద్రబాబు కూడా ఈసారి భూమా ఫ్యామిలీని పక్కన పెట్టి వేరే వారికి టికెట్లు ఇస్తారని అంటున్నారు. దాంతో అఖిలప్రియ ఏకంగా జగన్‌నే నమ్ముకుంది అంటున్నారు. జగన్ కనుక కరుణిస్తే తన రాజకీయ జీవితం మళ్లీ దారిన పడుతుందని నమ్ముతోంది.

ఈ విషయంలో ఆమెకు మేనమామ ఎస్వీ మోహనరెడ్డి అండ ఉంద‌ట. ఆయన కర్నూల్ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన వైసీపీలో 2019 ఎన్నికల ముందే చేరిపోయారు. అయితే జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ 2024 నాటికి కచ్చితంగా కర్నూల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటినుంచే ఎస్వీ గట్టిగా డిసైడ్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ తన బలాన్ని చూపిస్తున్నారు. మరో వైపు చూస్తే తన అక్క కూతురు అఖిలప్రియను కూడా వైసీపీలోకి తెస్తే బలం పెరుగుతుంది అని ఆలోచిస్తున్నారుట. ఆమె ఇపుడు పుట్టెడు కష్టాలలో ఉంది.

దాంతో ఎస్వీ ఈ విషయంలో రాయబారాలు నెరపుతున్నట్లుగా చెబుతున్నారు. అఖిలప్రియ కూడా ఆ మధ్య వైఎస్ విజయమ్మను కలసి వచ్చారు. తన బాధను జగన్ కి వినిపించి తిరిగి పార్టీలోకిచ్ చేర్చుకోమని కోరారు. అయితే జగన్ ఆమె విషయంలో ఎటువంటి హామీని ఇప్పటిదాకా ఇవ్వలేదన్ని తెలుస్తోంది. అటు నంద్యాలలో శిల్పా మోహనరెడ్డి కుమారుడు రవిచంద్ర కిశోర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయం. ఇటు ఆళ్ళగడ్డలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డిని మార్చాలనుకోవడంలేదు.

ఆ ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి పట్టు ఉంది. మధ్యలో భూమా ఫ్యామిలీ కొన్నాళ్ళు శాసించినా ఇపుడు భూమా నాగిరెడ్డి మరణంతో బాగా డౌన్ అయింది. దీంతో జగన్ అఖిల ప్రియ రాకను స్వాగతించరు అంటున్నారు. ఒకవేళ పార్టీలోకి తీసుకున్నా ఆమెకు టికెట్ రావడం అన్నది కల్ల అంటున్నారు. ఏది ఏమైనా మేనమామ ఆసరాతో ఆమె తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారుట. చూడాలి మరి.