థర్డ్ వేవ్ స్టార్ట్ అయితే.. రోజుకి లక్ష కేసులు..!

కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది అనుకునేలోపు.. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. థర్డ్ వేవ్ ప్రమాదం మొదలైనట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు పది రోజులుగా కరోనా కేసులు ప్రతిరోజూ 40వేలకు తగ్గడం లేదు.

వీటిలో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తుండగా.. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ ఎలా ఉండబోతుందన్న అంశంపై నిపుణులు ఒక అధ్యయనం చేపట్టారు. మేథమెటికల్‌ మోడల్‌ ఆధారంగా ఐఐటి కాన్పూర్‌, హైదరాబాద్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్‌, ఎం.విద్యాసాగర్‌ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది.

ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్‌ విజృంభణ వంటి కారణాలతో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయని, వీటితో థర్డ్‌ వేవ్‌ పొంచివుందని అభిప్రాయపడ్డారు. కేసులు క్రమంగా పెరిగి, అక్టోబర్‌ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు. ఒక్కరోజులో అత్యధికంగా లక్ష కంటే తక్కువ కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని, పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్ఠంగా 1,50,000గా కూడా ఉండొచ్చని చెప్పారు.

కాగా, సెకండ్‌ వేవ్‌లో గరిష్ఠంగా 4లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జీనోమిక్‌ కన్సార్టియం (INSACOG) నుంచి వెలువడిన వివరాల ప్రకారం.. మే, జూన్‌, జులై నెలల్లో ప్రతి 10 కేసుల్లో ఎనిమిదింటికి డెల్టా వేరియంటే కారణమని వెల్లడైంది.

మే నెలలో 4,500 పైగా రోజువారీ మరణాలు వెలుగుచూశాయి. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించడంతో వైరస్‌ దాడిని ఎదుర్కోవచ్చని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.