ఆమంచికి వైసీపీ చెక్‌.. మ‌రోదారి చూసుకోవ‌డ‌మేనా?

ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్కాయి. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా చీరాల పాలిటిక్స్ లో కుంప‌టి ర‌గులుతూనే ఉంది. వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు .. టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని కూడా.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని.. వైసీపీ పంచ‌కు చేరిపోయిన‌.. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తిల మ‌ధ్య రాజ‌కీయ వైరం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. త‌న‌కే ఆధిపత్యం ద‌క్కాల‌ని.. ఇరువురు నేతలు.. ఇక్క‌డ చేస్తున్న రాజ‌కీయంతో అభివృద్ధి మాట‌.. ప‌ట్టుత‌ప్పి.. ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ప‌డాల్సిన దుస్థితి దాపురించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి అద్దంకి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన క‌ర‌ణంను గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు.. ఇక్క‌డ‌కు తీసుకువచ్చి టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ సునామీలోను ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో టీడీపీ మురిసిపోయినా.. కొద్దికాలంలోనే ఆయ‌న‌పై ఉన్న కేసులు కావొచ్చు.. మ‌రేదైనా రీజ‌న్ కావొచ్చు.. వైసీపీలో చేరిపోయారు. అయితే.. క‌ర‌ణంపై పోరాడి ఓడిన ఆమంచికి ఆయ‌న వైసీపీలో చేర‌డం సుత‌రామూ ఇష్టం లేదు. ఇక‌, త‌ను త‌ప్ప‌.. ఇక్క‌డ మ‌రోనేత ఉండేందుకు వీలే లేదు.. అన్న‌ట్టుగా క‌ర‌ణం వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స‌మ‌రానికి రీజ‌న్‌గా మారింది.

అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం క‌ర‌ణానికి ఇస్తున్న ప్రాధాన్యం ఆమంచికి ఇవ్వ‌డం లేద‌నే గుస‌గుసలు వినిపిస్తున్నాయి. టీడీపీని దెబ్బ‌కొట్టాలంటే.. క‌ర‌ణంను వినియోగించుకోవ‌చ్చ‌నేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో క‌ర‌ణం వ‌ర్గానికే వైసీపీ బీఫారాలు ఇచ్చింది. అదేస‌మ‌యంలో ఆమంచికి ఒక్క ఫారం కూడా ఇవ్వ‌క‌పోవ‌డం వివాదానికి దారితీసి.. ఆమంచి వ‌ర్గం ఇండిపెండెంట్‌గానే పోటీకి దిగింది. ఈ క్ర‌మంలో 11 మంది ఆమంచి వ‌ర్గం గెలుపుగుర్రం ఎక్కారు. వీరంతా మ‌ళ్లీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని క‌లిసి.. వైసీపీలో చేరిపోయారు.

అయితే.. క‌ర‌ణం వ‌ర్గానికే చీరాల మునిసిపాలిటీలో గుర్తింపు ఎక్కువ‌గా ఉంది. చైర్మ‌న్‌, వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వులు కూడా వారికే ద‌క్కాయి. దీంతో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేదంటూ.. ఇటీవ‌ల జ‌రిగిన కౌన్సిల్ స‌మావేశాల్లో ఆమంచి వ‌ర్గం చిందులు తొక్కింది. అయితే.. మేం ఫ్యాన్ గుర్తుపై గెలిచాం.. మీరు బీరువా గుర్తుపై గెలిచారు కాబ‌ట్టి.. మీమే అస‌లైన వైసీపీ నాయ‌కుల‌మ‌ని క‌ర‌ణం వ‌ర్గం పేర్కొంది. మ‌రోవైపు .. అదిష్టానం నుంచి క‌ర‌ణానికి మ‌ద్ద‌తు ఉండ‌డం.. ఆమంచి వ‌ర్గానికి ప్రాధాన్యం లేక పోవ‌డం చూస్తే.. మున్ముందును ఆమంచిని వ‌దిలించుకునేందుకు వైసీపీ రెడీగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.