వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. మామూలు రచ్చ కాదుగా ?


రాజ‌కీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమ‌ర్శ‌లు అన్నీ కామ‌నే. అయితే.. ఇవ‌న్నీ కూడా రెండు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య అయితే.. కామ‌న్ అనుకోవ‌చ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితికి భిన్నంగా జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు.. మేధావిగా పేరున్న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య వివాదం చెల‌రేగింది. అయితే.. ఇప్పుడు అది కాస్తా.. ముదిరి రోడ్డున ప‌డింద‌ని వైసీపీలోనే గుస‌గుస వినిపిస్తోంది.

మంత్రి అనిల్‌ కుమార్‌ ఒకవైపు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు పరస్పరం యుద్ధానికి సిద్ధమయ్యారు. మట్టి తినేస్తున్నారని ఒకరు, ఇసుక దోచేస్తున్నారని మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం రాజ‌కీయంగా ఇద్ద‌రినీ.. తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా మట్టి తవ్వకాలు.. నెల్లూరు శివార్లలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తరలింపులపై అనిల్‌, కాకానిల మధ్య రెండేళ్లుగా నడుస్తున్న వైరం ముదిరిపాకాన పడ్డట్టు అయ్యింది. ఈ పంచాయితీ పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులకు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చింది. 8 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ సినరీసెజ్‌ కూడా కట్టించుకున్నారు. అయితే అనుమతులకు మించి ఇక్కడ మట్టి తవ్వకాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ వ్యవహారంపై విచారించాలని మంత్రి అనిల్‌ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఇదే వివాదానికి దారితీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వెనువెంట‌నే స్పందించిన ఎమ్మెల్యే కాకాని.. అనిల్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని పెన్నాలో ఇసుక త‌వ్వ‌కాలు.. అక్ర‌మంగా సాగుతున్నాయంటూ.. అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య త‌వ్వ‌కాల‌కు సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల యుద్ధం జరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల వ‌ర‌కు చేరింద‌ని.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.