జగన్ మేల్కొనకపోతే కష్టమేనా ?

కొన్ని సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాల్సుంటుంది. అలా కాకుండా వీలున్నంత కాలం సాగదీద్దామని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు, మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారు. పెన్షన్ విధానంలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమల్లోకి తేవాలనే డిమాండ్ తో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె యోచన చేస్తున్నారు.

ఇదే సమయంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసే యోచనాలో ఉన్నారు. ఈ విషయాన్ని డిసైడ్ చేయటానికి మంగళవారం సమావేశం కూడా పెట్టబోతున్నారు. దీనికి ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, నేషనల్ మజ్డూర్ యూనియన్ నేతలు పార్టిసిపేట్ చేయబతోన్నారు. మూడు యూనియన్లు కూడా ఆర్టీసీలో బలమైనవే. సమ్మె విషయంలో మూడు యూనియన్లు కలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.

నిజానికి అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు విధానాన్ని రద్దు చేస్తానని పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో ఆ విషయమై దృష్టిపెట్టలేదు. ఉద్యోగుల సెగ మొదలైన తర్వాత సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఈమధ్యనే కమిటిని నియమించింది. అయితే కమిటిని నియమించటం కాదని ఏకంగా రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే తొందరలోనే సమ్మెకు దిగటమే మార్గమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో ఆర్టీసీలో కూడా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా తమ సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉందని యూనియన్ నేతలంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా ఉపయోగం కనబడలేదని నేతలకు మంటగా ఉంది. విజ్ఞప్తులు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాబట్టి సమ్మెకు దిగటమే ఏకైక మార్గంగా నేతలంటున్నారు. ఈ విషయాన్ని తేల్చటానికే విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒకేసారి ఇటు ఉద్యోగులు అటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి వెంటనే జగన్ మేల్కొనకపోతే కష్టమే.