మోత్కుపల్లి ఇక్కడైనా సర్దుకుంటాడా ?

ఈయన ఒకపుడు ఫైర్ బ్రాండ్ నేతగా పాపులరయ్యారు. అయితే కాలక్రమంలో పరిస్ధితుల ప్రభావం కారణంగా ఎవరికీ కాకుండా పోయారు. అందుకనే సంవత్సరాలుగా అనామకంగా ఉండిపోయారు. అయితే ఇపుడు అధికార టీఆర్ఎస్ లో చేరటం ద్వారా పూర్వవైభవాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈయనే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. తన వ్యూహాన్ని అమలు చేయటంలో భాగంగానే బీజేపీకి మూడు రోజుల క్రితమే రాజీనామా కూడా ఇచ్చేశారు.

మోత్కుపల్లిది మొదటి నుండి విచిత్రమైన వ్యవహార శైలి. ఏ పార్టీలో ఉన్నా, విషయం ఏదైనా తన మాటే చెల్లుబాటు కావాలనే పంతం ఎక్కువ. ఎన్టీయార్ పిలుపుతో నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లోకి దూకారు. చిన్న వయస్సులోనే ఎంఎల్ఏగా గెలవటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. అయితే ఎన్టీయార్ తో పడని కారణంగా పార్టీకి దూరమయ్యారు.

మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 1999లో కాంగ్రెస్ తరపున గెలిచినా చంద్రబాబునాయుడు పిలుపుతో టీడీపీలోకి దూకేశారు. అప్పటి నుండి 2017 వరకు టీడీపీలో తన హవా బాగానే నడిచింది. చాలా మంది నేతలకు లాగే రాష్ట్ర విభజన ప్రభావం ఈయన పైన కూడా పడింది. ఎప్పుడైతే తెలంగాణా టీడీపీకి క్షీణ దశ మొదలైందో మోత్కుపల్లికి కూడా డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోత్కుపల్లికి చాలా మంది నేతలతో పడదు. ఎందుకంటే తనమాటే చెల్లుబాటవ్వాలనే మనస్తత్వం వల్లే తరచు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుండి టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటు నానా రచ్చ చేశారు. ఈయన గోలను భరించలేక చివరకు చంద్రబాబు పార్టీ నుండే బహిష్కరించారు. టీడీపీలో ఉండి టీఆర్ఎస్ కు వత్తాసుగా మాట్లాడిన కారణంగా తనను కేసీయార్ అక్కున చేర్చుకుంటారని ఆశించిన మోత్కుపల్లికి నిరాసే ఎదురైంది.

తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ నేత బీజేపీలో చేరారు. అయితే కమలంపార్టీలో కూడా ఈయనను ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో తోచక చివరకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఈయనే ప్రకటించారు. తన రాజీనామాకు కారణాన్ని ఈటలను చేర్చుకోవటంగా మోత్కుపల్లి చూపటమే విచిత్రం. ఎందుకంటే మోత్కుపల్లి, ఈటల జిల్లాలు వేరు, నియోజకవర్గాలు వేరు. అయినా ఈటలను అవినీతి పరుడిగా చిత్రీకరించటం, ఈటలను పార్టీలో చేర్చుకోవటం తనకిష్టం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

రాజకీయంగా మోత్కుపల్లి జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు చేరుకునేశారు. చివర దశలో టీఆర్ఎస్ లో కూడా సర్దుకోలేకపోతే ఇక మారటానికి పార్టీ కూడా లేదు. టీడీపీ నుండి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన నేతల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి కొత్తగా చేరబోతున్న మోత్కుపల్లి రాజకీయం ఎలాగుంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే.