బీజేపీ నేత‌ల బీపీ పెంచేస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయ‌ని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగ‌డ‌లు బీజేపీ నేత‌ల్లో బీపీ పెంచేస్తున్నాయంటున్నారు. రేవంత్ రెడ్డి ఎత్తుగ‌డ‌లు బీజేపీ నేత‌ల ధైర్యానికి బ్రేకులు వేసేలా ఉన్నాయ‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు, కలుస్తున్న నేత‌లు దీనికి నిద‌ర్శ‌న‌మంటున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లువురు నేత‌ల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే. వారిని కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు. దీంతో పాటుగా ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో సైతం రేవంత్ ట‌చ్‌లో ఉంటున్నార‌ని స‌మాచారం. ప‌లువురు ముఖ్య‌నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీలోని టీడీపీ మాజీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జ‌నార్ద‌న్‌, విక్రమ్ గౌడ్‌ల‌తో రేవంత్ రెడ్డి ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీని వీడనున్న ఈ నేత‌లు తిరిగి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని సమాచారం. ఈ నేత‌లంద‌రూ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీలో నుంచి బీజేపీలో చేరిన కొంద‌రు నేత‌లు ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. అలాంటి అసంతృప్త నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్లి వారిని కాంగ్రెస్ గూటికి తీసుకురావాల‌ని రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వ‌చ్చే వారంలో న‌లుగురు, ఐదుగురు నేత‌ల‌కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పేలా ఆయ‌న ప్లాన్ రెడీ చేసిన‌ట్లు స‌మాచారం. ఇదంతా బీజేపీ నేత‌ల‌కు బీపీ పెరిగిపోయేలా మారింద‌ని చెప్తున్నారు.