సింగరేణి కార్మికులపై వరాల జల్లు.. కారణం ఇదేనా?

సింగరేణి కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్.. వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇంత సడెన్ గా.. సీఎం వాళ్లపై వరాల జల్లు కురిపించడానికి కారణం త్వరలో రానున్న ఎన్నికలేనా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణ‌తో పాటు ద‌క్షిణ భార‌త దేశానికి వెలుగులు నింపుతున్న సింగ‌రేణిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా ప‌డ్డ సింగ‌రేణి ఎన్నిక‌లు త్వరలో జరగనుండటంతో.. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది.

గ‌తంలో కేసీఆర్ సింగ‌రేణి కార్మికుల‌కు అనేక హామీలిచ్చారు. కానీ వాటి అమలు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. దీంతో..తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే సింగరేణి కార్మికులు అసంతృప్తితోనే ఉన్నారు. అంతేకాదు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘాన్ని టీఆర్ఎస్ కు అనుబంధంగా మొద‌లుపెట్టి… అధికారిక సంఘంగా గుర్తింపు పొంద‌టంలో శ్ర‌మించిన కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య ఆ మ‌ధ్య సంఘానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌లొచ్చే స‌మ‌యానికి ఆయ‌న్ను తిరిగి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు.

అంతేకాక.. ఎన్నికల్లో భాగంగానే.. కేసీఆర్ ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. అంతేకాదు సింగ‌రేణి కోసం మెడిక‌ల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.