టీ టీడీపీ పై బాబు వ్యూహం ఫ‌లించేనా?

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌క్క‌ని న‌ర‌సింహులును పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఎంపిక చేశారు. రాష్ట్ర పార్టీ ప‌గ్గాల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లోనూ టీడీపీని ప‌రుగు లు పెట్టించే ల‌క్ష్యంతో ఇరు రాష్ట్రాల‌కూ అధ్య‌క్షుల‌ను ఎంపిక చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో 2014లో టీటీడీపీ అధ్య‌క్షుడిగా ఎల్. ర‌మ‌ణ‌ను ఎంపిక చేసి ప‌గ్గాలు అప్ప‌గించారు. ఈయ‌న హ‌యాంలో రెండు కీల‌క ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. పార్టీ పుంజుకున్న ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. ఈలోగా టీఆర్ ఎస్ నుంచి ఆహ్వానం రావ‌డంతో ర‌మ‌ణ‌.. ఇటీవ‌ల గులాబీ ద‌ళంలో చేరిపోయారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష పీఠం ద‌క్కించుకునేందుకు కీల‌క నేత‌లు.. చాలా మంది ముందుకు వ‌చ్చారు. రావుల చంద్ర‌శేఖ‌రెడ్డి వంటి కీల‌క నేత‌లు ఈ క్యూలో ఉన్నారు. అయితే.. వీరంద‌రినీ కాద‌ని.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌క్క‌ని న‌ర‌సింహులుకు చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చారు.

మ‌రి బాబు వ్యూహం ఏంటి? కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వంటి కీల‌క‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు పార్టీలు ప‌గ్గాలు అప్ప‌గిస్తుంటే.. వారంద‌రినీ కాద‌ని.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన న‌ర‌సింహులును ఎందుకు ఎంపిక చేశారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం టీడీపీని బ‌లోపేతం చేసేందుకు కీల‌క వ్యూహాల‌తో ముందుకు న‌డ‌వాల్సిన నాయ‌కుల అవ‌స‌రం చాలా ఉంది.

కానీ, కేవలం 1994-99 మధ్య షాద్ న‌గ‌ర్ నుంచి ఒక్క‌సారి మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకున్న బ‌క్క‌ని వ‌ల్ల‌.. పార్టీలో కేడ‌ర్‌ను న‌డిపించ‌డం సాధ్య‌మేనా? అన్న‌ది కీల‌క ప్ర‌శ్న‌. పైగా అగ్ర‌వ‌ర్ణ ఆధిప‌త్య ఎక్కువ‌గా ఉన్న తెలంగాణ రాజ‌కీయాల్లో .. న‌ర‌సింహు లు ఒంట‌రి పోరాటం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది కూడా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

పార్టీలో ను, కేడ‌ర్‌లోను ప‌ట్టున్న నాయ‌కుడిని నిల‌బెట్టి ఉంటే.. ప‌రిస్థితి బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం‌ కృషి చేస్తానని బక్కని నరసింహులు చెబుతున్నారు. అంతేకాదు టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

కానీ, రాష్ట్రంలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. యూత్‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లు.. యువ‌త‌ను దృష్టి లో పెట్టుకుని రాజ‌కీయాలు చే్స్తున్నాయి. ఈ క్ర‌మంలో బ‌క్క‌ని వంటివారు యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం సాధ్య‌మేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.

పార్టీలోనే ఉంటూ.. అధికార పార్టీతో మిలాఖ‌త్ అయిన‌వారు.. అనేక మంది ఉన్నారు. వీరిని గాడిలో పెట్ట‌డం.. పార్టీని పుంజుకునేలా చేయ‌డం వంటివి.. బ‌క్క‌నికి క‌త్తిమీద సామేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఏవ్యూహంతో ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారో.. బ‌క్క‌ని.. ఎలా పుంజుకుంటారో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు.