ఇది జ‌గ‌న్ వైఫ‌ల్యం.. గెజిట్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

కృష్ణా, గోదావ‌రి న‌దుల జ‌లాల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ఏకంగా.. త‌నే పెత్త‌నం చేసేలా నిర్ణ‌యం తీసుకుని గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తీవ్ర అభ్యంత‌రం.. వ్య‌క్తం చేశారు. అంతేకాదు, దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా, 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఏమంటార‌నే చ‌ర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆస‌క్తిగా మారింది.

ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు ఈ గెజిట్‌పై స్పందించారు. ఈ గెజిట్‌ను ఏపీ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా ఉంద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్లటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చంద్రబాబు మండిపడ్డారు.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతవరకైనా పోరాడుతుందని తేల్చి చెప్పారు.

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్కు బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. గెజిట్ను పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెలిపారు.

రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేసిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారెవ్వరూ దీనిని స్వాగతించరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంల మూర్ఖత్వం కారణంగానే నదీ జలాలపై కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయన్నారు. మన ప్రాజెక్టుల మీదకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ బలగాల అనుమతి కావాల్సిన దుర్గతి ఏర్పడిందని ఆక్షేపించారు. చివరకు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం కనిపిస్తోందన్న ఆయ‌న‌.. వెలిగొండ ప్రాజెక్టును మాత్రం విస్మరించి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ లాంటి చిన్న ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేంటని ప్రశ్నించారు.