సెకెండ్ ప్లేస్ కోసమేనా ఈ గోలంతా ?

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణాలో ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేసైతే టీఆర్ఎస్ దే. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్లేసులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరలాంటపుడు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎందుకింతగా గోల చేసేస్తున్నారు ? ఎందుకంటే కేవలం సెకండ్ ప్లేస్ కోసమే అనేది అర్ధమైపోతోంది.

వచ్చే ఎన్నికలనాటికి కూడా టీఆర్ఎస్సే మొదటిస్ధానంలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే ప్రతిపక్షాల్లో అనైక్యతే. ప్రతిపక్షాలు ఎంత బలోపేతమైతే టీఆర్ఎస్ కు అంతమంచిదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ అని చెప్పటంలో సందేహంలేదు. అంతమాత్రాన అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత లేదని అనుకునేందుకు లేదు.

కాకపోతే టీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ప్రతిపక్షాల్లో లేదు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అధికారపార్టీకి అంత అడ్వాంటేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉన్న కాంగ్రెస్, బీజేపీ సరిపోదన్నట్లు కొత్తగా వైఎస్సార్టీపీ మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంతగా బలపడితే ఓట్లలో అంత చీలికవస్తుంది.

అప్పుడు చీలిపోయే ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొస్తుందనేదానిపైనే సెకెండ్ ప్లేస్ ఎవరిదనేది తేలుతుంది. ఇప్పటికైతే రెండు అంశాలు వాస్తవం. మొదటిది టీఆర్ఎస్ పైన జనాల్లో వ్యతిరేకత ఉందిన్నది నిశ్చయం. అలాగే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ఏ పార్టీకి లేదన్నది అంతే నిజం. కాబట్టి ముందు ముందు ప్రతిపక్షాల్లో ఏది ఎంత బలపడుతుందో చూడాల్సిందే.